అడుగడుగనా ఆంక్షలు.. అమరావతిలో ముందస్తు అరెస్ట్‌లు

  • Publish Date - January 7, 2020 / 05:08 AM IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మూడు రాజధానులు తరలింపు అంశంపై ఆగ్రహావేశాలు చల్లారలేదు. రైతులు, ప్రతిపక్షాలు ఆందోళనలను సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న ఆందోళన 21వ రోజుకు చేరుకుంది. నిరసనల్లో భాగంగా ఇవాళ(07 జనవరి 2019) జాతీయ రహదారులను దిగ్బంధించాలని నిర్ణయించింది రైతుల జేఏసీ.

అయితే అందుకు అనుమతి లేదంటూ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో రాజధాని గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. ముందస్తుగా ఎక్కడికక్కడ రైతులను, టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. కీలక నేతల ఇళ్లకు వెళ్లిని వారిని గృహ నిర్బంధం చేస్తున్నారు. హైవేల దిగ్బంధానికి వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌, ఎంపీ కేశినేని నానీని పోలీసులు అడ్డుకున్నారు. అలాగే మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావులను కూడా నిర్బంధించారు. 

అలాగే చినకాకాని గ్రామంలో నిరసన కార్యక్రమంలో పాల్గొనే వారికోసం 2వేల మందికి గాను భోజనం తయారు చేస్తుండగా పోలీసులు అడ్డుకొని రైతులను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి ప్రాంతంలో టీడీపీ నాయకుల హౌస్‌ అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. గ్రామాల్లో ముఖ్య నేతలను స్టేషన్‌లకు తరలిస్తున్నారు.

రాజధాని అమరావతి ఒక్కటే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జేఏసీ ఆధ్వర్యంలో చినకాకాని జాతీయ రహదారిపై నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందస్తు చర్యలో భాగంగా గుంటూరు జిల్లా, మంగళగిరి జెఏసీ నాయకుల హౌస్ అరెస్ట్ చేశారు. తెల్లవారుజాము నుంచే మంగళగిరి, తాడేపల్లి, ప్రాంతాల్లో జేఏసీ నేతలు, ముఖ్యంగా టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు.