ఢిల్లీలో పాజిటివ్..జైపూర్ లో నెగటివ్: నాకు కరోనా ఉందా?లేదా?అయోమయంలో ఎంపీ

  • Publish Date - September 15, 2020 / 12:13 PM IST

హోం మంత్రి అమిత్ షా సహా ఇప్పటివరకు ఏడుగురు కేంద్రమంత్రులు, 25 మంది ఎంపీలకు కరోనా సోకింది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఎంపీలందరికీ కరోనా పరీక్షలు చేయగా..దాదాపు 25 మందికి పైగా ఎంపీలకు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చినవారందరినీ క్వారంటైన్ లో ఉండాలని..పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావద్దని ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. పాజిటివ్ వచ్చినా..నెగిటివ్ వచ్చినా ఒక క్లారిటీ ఉంటుంది. కానీ ఓచోట పాజిటివ్ మరోచోట నెగిటివ్ రిపోర్ట్ వస్తే పరిస్థితి ఏంటీ? అదే జరిగింది రాజస్థాన్ బీజేపీ ఎంపీ హనుమాన్ బెనీవాల్ పరిస్థితి. దీంతో ఆయన అయోమయంలో పడ్డారు. తనకు పాజిటివా? నెగిటివా? అనేది నిర్ధారించుకోలేక తల పట్టుకుంటున్నారు ఎంపీ హనుమాన్ బెనీవాల్.


ఇంతకీ విషయం ఏమిటంటే..లోక్ సభ సభ్యుడు హనుమాన్ బెనీవాల్ ఢిల్లీ పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఎంపీలందరికీ కరోనా పరీక్షలు చేయించగా..ఆయనకూడా అందరు ఎంపీల్లాగే ఢిల్లీలో పరీక్షలు చేయించుకోగా.. కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన సభకు హాజరు కాకుండా..తన స్వంత రాష్ట్రం అయిన రాజస్థాన్ వెళ్లిపోయారు. అక్కడ జైపూర్ లో మరోసారి పరీక్ష చేయించుకోగా..నెగటివ్ వచ్చింది.


దీంతో ఆయన తనకు కరోనా సోకలేదంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆ రిపోర్టు కాపీలను కూడా పోస్ట్ చేశారు. ఈ రెండింటిలో ఏ రిపోర్టును నమ్మాలో..ఏ రిపోర్టును నమ్మకూడదో తనకు అర్థం కావడం లేదని..తాను అయోమయంలో పడిపోయానని తెలిపారు. ఈ ట్వీట్ ను చూసిన నెటిజన్లు..ఇప్పటివరకూ సామాన్యులకు మాత్రమే ఇటువంటి తిప్పలు..అయోమయం ఉందనీ..ఇప్పుడు సాక్షాత్తు ఓ ఎంపీకి కూడా ఇదే పరిస్థితి ఎదురైందని..ఇదీ పరీక్షల నిర్వాకం..రిపోర్టులు వెల్లడించే నిర్వాకం అంటూ తిట్టిపోస్తున్నారు.



కాగా..సెప్టెంబర్ 11న ఎంపీ హనుమాన్ బెనీవాల్ ఇచ్చిన నమూనాలను పరీక్షించిన డాక్టర్లు పాజిటివ్ అని రిపోర్టు ఇచ్చారు. ఇది ఐసీఎంఆర్ చేసిన పరీక్ష. ఆపై 13న ఆయన జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రిలో ఇచ్చిన నమూనా ఫలితం నెగటివ్ గా రావడం గమనించాల్సిన విషయం.