Sri Lanka’s deposed president: తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తిరిగి ఆ దేశానికి రానున్నారు. కొన్ని వారాల క్రితం ఆయన ప్రజాగ్రహం కారణంగా దేశం వదిలి పారిపోయిన విషయం తెలిసిందే. మొదట మాల్దీవులు, అనంతరం సింగపూర్ కు ఆయన పారిపోయారు. గొటబాయ రాజపక్స తిరిగి రేపు శ్రీలంక రానున్నట్లు ఆ దేశంలోని ఓ రక్షణ శాఖ అధికారి మీడియాకు తెలిపారు. ప్రస్తుతం గొటబాయ రాజపక్స థాయిలాండ్ లోని ఓ హోటల్ లో ఉన్నట్లు ఆయన చెప్పారు.
కాగా, ఈ ఏడాది జూలై రెండో వారంలో శ్రీలంకలో ఆందోళకారులు అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్ళారు. దీంతో 13వ తేదీన గొటబాయ రాజపక్స దేశ వదిలి మాల్దీవులకు పారిపోయారు. తాత్కాలిక వీసాపై ఆయన అక్కడ నివసిస్తున్నారు. ప్రస్తుతం శ్రీలంక అధ్యక్షుడిగా రణీల్ విక్రమసింఘే బాధ్యతల్లో కొనసాగుతున్నారు. శ్రీలంకలో పరిస్థితులు మెరుగుపడలేదు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా వేధిస్తోంది.