కంచికచర్ల : కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు అందించిన సమాచారం మేరకు గుజ్జర్లంక గణేశ్ (8), శ్రీమంతు (5), గౌతమ్ (4) ముగ్గురూ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు.
తల్లిదండ్రులు ఉపాధి కోసం కర్ణాటక వెళ్లగా.. చిన్నారులు నాయనమ్మ వద్దే ఉండి చదువుకుంటున్నారు. మంగళవారం స్కూల్ కు వెళ్లన అన్నదమ్ములు మధ్యాహ్నం ఇంటికి తిరిగి వస్తూ మార్గ మధ్యంలో ఉన్న చెరువు వద్దకు వెళ్లి స్నానానికి దిగారు. ప్రమాదవశాత్తు ఒకరితర్వాత ఒకరు ముగ్గురు చెరువులో మునిగి చనిపోయారు.
దూరం నుంచి ఇదిగమనించిన స్ధానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు, పోలీసులుసుమారు గంట సేపు గాలించి ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నందిగామ రూరల్ పోలీసులుకేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.