పవన్ కళ్యాణ్‌కి అప్పుడే చెప్పా సినిమాలు చెయ్యమని: ఉండవల్లి

  • Publish Date - February 6, 2020 / 07:12 AM IST

కేంద్ర ప్రభుత్వ విధానాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో కేంద్ర ప్రభుత్వానికి అర్థం అవుతుందా? అని ప్రశ్నించారు. మన దేశ జీడీపీ కన్నా బంగ్లాదేశ్ జీడీపీ ఇప్పుడు అధికంగా ఉందని వెల్లడించారు ఉండవల్లి. మనం సాయం చేసిన బంగ్లాదేశ్ ఇప్పుడు మనకన్న ఎక్కువ జీడీపీ సాధించిందని, మన్మోహన్ ప్రధాని అయ్యాక మన దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడిందని ఇప్పుడు మళ్లీ నాశనమైందని అన్నారు.

కేవలం హిందుత్వ, పాకిస్తాన్ ఎజెండాతో కేంద్ర ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే చర్యలు చేపట్లేదని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలని కేంద్ర ప్రభుత్వానికి మెయిల్ పంపానని, తన మెయిల్‌ను పట్టించుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్థిక వ్యవస్థపై దృష్టిపెట్టాలని సూచనలు చేశారు. 

ఇదే సమయంలో జగన్ మాజీ జస్టిస్ చలమేశ్వర్‌ను కలిస్తే టీడీపీ తప్పు పడుతుందని, ఓటు నోటు కేసు ఉండగా.. చంద్రబాబు ఛలమేశ్వర్ ని కలవలేదా? అని ప్రశ్నించారు. అలాగే పవన్ కళ్యాణ్‌ని సినిమాలు చెయ్యమని ఫస్ట్‌లోనే చెప్పానని, అతను సినిమాలు చెయ్యడం మంచిదేనని అన్నారు.