వెల్లువెరిసిన చైతన్యం : బారులు తీరిన ఓటర్లు 

  • Publish Date - April 11, 2019 / 02:03 AM IST

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చైతన్యం వెల్లువెరిసింది. ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఏప్రిల్ 11వ తేదీ ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. ఉదయం 6 గంటల కంటే ముందుగానే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. క్యూ లైన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఓటు వేసేందుకు ఉత్సాహంగా ప్రజలు ముందుకు రావడం అభినందనీయమని ఎన్నికల అధికారులు వెల్లడిస్తున్నారు. చంటిపిల్లలతో పోలింగ్ కేంద్రానికి ఓటు హక్కు వినియోగించుకొనే దృశ్యాలు కనిపిస్తున్నాయి. 

వృద్ధులు, యువతీ యువకులు, మహిళలు ఓటేసేందుకు భారీగానే తరలివస్తున్నారు. ఎండలు దంచి కొడుతుండడంతో ముందుగానే ఓటు వేయడానికి ప్రజలు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. మంగళగిరి నియోజకవర్గంలో కూడా ఓటర్లు ఓటు వేయడానికి క్యూ లైన్లలో నిలబడ్డారు. మధ్యాహ్న సమయానికి రద్దీ తగ్గే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో మందకొడిగా పోలింగ్ ప్రారంభమైందని సమాచారం. 

ఇదిలా ఉంటే ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమవుతోంది. ఈవీఎంలు మొరాయించడంతో మాక్ పోలింగ్ ఆలస్యంగా స్టార్ట్ అయ్యింది. వెంటనే టెక్నికల్ సిబ్బంది ఈవీఎంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మాక్ పోలింగ్ ఆలస్యం కావడం..ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. మొత్తంగా ఏపీలో ఓటర్ల చైతన్యం వెల్లువెరిసింది.