Didi Promise to gov employees : కరోనాతో చనిపోతే ప్రభుత్వ ఉద్యోగం..సీఎం మమత బెనర్జీ

  • Publish Date - July 16, 2020 / 11:26 AM IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న క్రమంలో ఆఫీసులకు వచ్చి పనులు చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులు హడలిపోతున్నారు. ఇప్పటికే చాలమంది ఉద్యోగులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది ఉద్యోగులు పనులు చేసేందుకు భయపడిపోతున్నారు.

దీన్ని దృష్టిలో పెట్టుకున్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం మమతా బెనర్జీ ఊహించని వరాన్ని ప్రసాదించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కరోనాతో మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. అధికారులతో జరిగిన సమావేశంలో ఆమె ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. దీదీ ఇచ్చిన హామీతో ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

రాష్ట్రంలో ఇప్పటికే చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు వైరస్ బారిన పడుతున్నారు. వీరిలో 12మంది మృతి చెందారు. దీంతో వారు ఆఫీసులకు వచ్చి పని చేసేందుకు భయపడిపోతున్నారు. ఉద్యోగుల కుటుంబాల్లో భరోసా నింపడానికి మమతా బెనర్జీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

కాగా ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 268 మంది పోలీసులు,30 మంది డాక్టర్లకు 43 మంది వైద్య సిబ్బంది, 62 మంది ఇతర అధికారులు మహమ్మారి వైరస్‌తో బాధపడుతున్నారు. అక్కడ 32,838 మందికి వ్యాధి సోకగా..19,931 మంది కోలుకున్నారు. 980 మంది ప్రాణాలు కోల్పోయారు.