Uttar Pradesh Farmer : వరుణ దేవుడిపై ఫిర్యాదు చేసిన రైతు
దేశంలోని పలు రాష్ట్రాల్లో వానలు కురిసి,వరదలు పోటెత్తుతుంటే బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో కరువు పరిస్ధితులు నెలకొన్నాయి.
- chvmurthy
- Published On : July 19, 2022 / 02:15 PM IST
Uttar Pradesh
Uttar Pradesh Farmer : దేశంలోని పలు రాష్ట్రాల్లో వానలు కురిసి,వరదలు పోటెత్తుతుంటే బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో కరువు పరిస్ధితులు నెలకొన్నాయి. దీంతో ఒకరైతు(Farmer) వరుణ దేవుడిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
యూపీలోని(Uttar Pradesh) గోండా జిల్లాలో శనివారం ఫిర్యాదుల పరిష్కారం రోజును ప్రభుత్వాధికారులు నిర్వహించారు. చాలా మంది ప్రజలు తమ వినతులు ప్రభుత్వాధికారులకు సమర్పించారు. అందులో ఒక విచిత్రమైన కంప్లైంట్ వచ్చింది. ఝలా గ్రామానికి చెందిన రైతు సుమిత్ కుమార్ యాదవ్, వర్షాలు కురిపించనందుకు వరుణ దేవుడిపై ఫిర్యాదు చేసాడు.
చాలా నెలలుగా వర్షాలు పడలేదని…. గౌరవనీయ అధికారుల దృష్టికి తీసుకు రావాలని కోరుకుంటున్నాను. కరువు కాటకాలతోప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఈ పరిస్ధితి వ్యవసాయం, పశువులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో కుటుంబాల్లోని మహిళలు, పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావును ఈ విషయంలో భాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను. అని ఫిర్యాదు పత్రంలో రాశాడు. వర్షాలు కురిపించనుందుకు తాను వరుణ దేవుడిపై ఫిర్యాదు చేస్తున్నట్లు అందులో పేర్కోన్నాడు.
ఫిర్యాదు పూర్తిగా చదవని రెవెన్యూ అధికారి దీనిపై అత్యవసర చర్యల కోసం ఉన్నాతాధికారులకు సిఫార్సు చేస్తూ ఫార్వర్డ్ చేశారు. ఆ మేరకు ఆయన స్టాంప్ వేసి సంతకం చేశారు. చివరికి ఆ ఫిర్యాదు కలెక్టర్ కార్యాలయానికి చేరింది. అక్కడ ఆ ఫిర్యాదు చూసిన ఒక ఉద్యోగి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అది ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై సోషల్ మీడియాలో తెగ కామెంట్లు రావటంతో రెవెన్యూ అధికారి స్పందించారు.
అలాంటి ఫిర్యాదు ఏదీ తన వద్దకు రాలేదని.. దానిపై ఉన్న స్టాంప్ నకిలీదని ఆయన చెప్పారు. గ్రీవెన్స్ డే లో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖలకు మాత్రమే పంపుతామని… ఇది ఎవరో కావాలని చేసిన దురద్దేశమైన పని అని ఆయన ఆరోపించారు. దీనిపై దర్యాప్తు జరుపుతామని ఆయన తెలిపారు. కాగా ఆ ఫిర్యాదుపై స్టాంప్ తో పాటు ఆయన సంతకం కూడా ఉండటం గురించి ఆయన ప్రస్తావించలేదు.
Also Read : Nupur Sharma: నుపుర్ శర్మను అంతమొందించాలని భారత్లోకి పాకిస్తానీ..
