AP Weather Alert: ఇటు మండుటెండలు, అటు పిడుగుల వానలు.. ఏపీలో రేపు భిన్న వాతావరణం

AP Weather Heatwaves: ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, మధ్యాహ్నం సమయంలో బయటకు రావద్దని ప్రజలకు సూచించింది విపత్తుల నిర్వహణ సంస్థ.

  • Updated on- April 28, 2026 / 11:47 AM IST

Ap Weather Heat Waves Rain Fall In Andhra Pradesh

AP Weather Report: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దీనికి వేడి గాలుల తీవ్రత కూడా తోడైంది. దీంతో హీట్ స్ట్రోక్ ప్రమాదం పెరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అటు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కంభం (మార్కాపురం)లో 45.7°C గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 227 మండలాల్లో 41°C పైగా ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి.

రేపు 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరో 21 మండలాల్లో సాధారణ వడగాల్పుల హెచ్చరిక జారీ చేసింది. అటు రాయలసీమ, కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉరుములు, పిడుగుల సమయంలో పొలాల్లో, చెట్ల కింద, విద్యుత్ పోల్స్ దగ్గర నిలబడవద్దని హెచ్చరించింది. సురక్షిత ప్రాంతాల్లోనే తలదాచుకోవాలంది.

ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, మధ్యాహ్నం సమయంలో బయటకు రావద్దని ప్రజలకు సూచించింది విపత్తుల నిర్వహణ సంస్థ. అత్యవసరం అయితేనే బయటకు రావాలంది. అది కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. గుండె, షుగర్, బీపీ ఉన్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంది. దాహం లేకపోయినా తరచూ నీరు తాగాలని సూచన చేసింది. ఎండలో బయటకు వెళ్తే రక్షణ చర్యలు తప్పనిసరి అని స్పష్టం చేసింది. తలకు టోపీ, కళ్లకు గ్లాసెస్ ధరించాలంది.

Also Read: ఎకరం కేవలం 99 పైసలే.. విశాఖలో ఇన్ఫోసిస్‌కు 20 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం