Cyclone Montha: స్కూళ్లకు 5 రోజులు సెలవులు.. వణికిస్తున్న తుపాను.. ఏపీ ప్రభుత్వం అలర్ట్..
ఏలూరు, పల్నాడు జిల్లాల్లోనూ వరుసగా రెండు రోజులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
- Naveen
- Updated on- October 27, 2025 / 12:28 AM IST
Cyclone Montha: మొంథా తుపాను వణికిస్తోంది. ఏపీ తీర ప్రాంతంవైపుగా దూసుకొస్తోంది. మరికొన్ని గంటల్లో తుపాను బలపడే అవకాశం ఉంది. దీంతో ఏపీ సర్కార్ అలర్ట్ అయ్యింది. పలు జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వరుసగా సెలవులు ప్రకటించింది. కొన్ని చోట్ల 3 రోజులు, మరికొన్ని చోట్ల 2 రోజులు హాలిడేస్ ఇచ్చారు. అయితే, పరిస్థితిని బట్టి సెలవుల్లో మార్పులు చేర్పులు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
మొంథా తుఫాన్ కాకినాడ జిల్లాపై భారీగా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అక్కడ వరుసగా 5 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఈ నెల 27వ తేదీ నుంచి 30 వరకు స్కూల్స్ కు సెలవులు ఇచ్చారు. మిగతా జిల్లాల్లో 1 నుంచి 3 రోజుల వరకు సెలవులిచ్చారు. కృష్ణా, బాపట్ల జిల్లాల్లో మూడు రోజులు.. తూర్పుగోదావరి జిల్లాలో 2 రోజులు.. అన్నమయ్య, కడప జిల్లాల్లో 2 రోజులు సెలవులు ప్రకటించారు. ఏలూరు, పల్నాడు జిల్లాల్లోనూ వరుసగా రెండు రోజులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
తుపాను నేపథ్యంలో ఇప్పటివరకు 20 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. పరిస్థితిని బట్టి ఇతర జిల్లాల్లోనూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
తీవ్ర వాయుగుండం 12 గంటల్లో నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడనుంది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి, ఆరోజు రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే ఛాన్స్ అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తుపాను ప్రభావంతో ఇవాళ కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది.
Also Read: ముంచుకొస్తున్న మహా ముప్పు.. ఏపీలో అత్యంత భారీ వర్షాలు.. ఈ 7 జిల్లాలకు రెడ్ అలర్ట్..
