ఏపీకి వడగాల్పుల హెచ్చరిక.. ఈ మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం
తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.
- Naveen
- Published On : March 26, 2026 / 07:57 PM IST
Heat Waves: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వడగాల్పుల హెచ్చరిక జారీ చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. రాష్ట్రంలో రేపు తీవ్ర వడగాల్పులపై అలర్ట్ ఇచ్చింది. 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందంది. పార్వతీపురం మన్యం, పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాలను ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించింది. గుమ్మలక్ష్మీపురం, కురుపాం, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, జగ్గంపేట, కోరుకొండ, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో హీట్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది.
మొత్తం 32 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఎన్టీఆర్ జిల్లాలో 7 మండలాలపై అత్యధిక ప్రభావం ఉండనుంది. ఇక శనివారం రాష్ట్రవ్యాప్తంగా 90 మండలాల్లో వడగాల్పుల అవకాశం ఉందంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. కడపలో అత్యధికంగా 40.7°C ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది.
శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాలు, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, వర రామచంద్రాపురం, కాకినాడ జిల్లా జగ్గంపేట, తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం.
ఇవాళ వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (32):
విజయనగరం 4, పార్వతీపురం మన్యం 3, పోలవరం 3, కాకినాడ 1, తూర్పుగోదావరి 2, ఏలూరు 4, కృష్ణా 2, ఎన్టీఆర్ 7, గుంటూరు 1, పల్నాడు జిల్లాల్లోని 5 మండలాల్లో వడగాల్పులు ప్రభావం.
శనివారం 90 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం.
గురువారం కడప జిల్లా కమలాపురంలో 40.7°C, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 40.6°C, కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో 40.5°C, నంద్యాల జిల్లా కొత్తపల్లెలో 40.4°C, కర్నూలు జిల్లా బస్తిపాడులో 40.3°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా టోపీ, గొడుగు పెట్టుకోవాలంది. ఇక వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంది. వడ దెబ్బ నివారణకు తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలని సూచనలు చేసింది. చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Also Read: AP కేబినెట్ భేటీ.. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేలా తీర్మానం
