Moderate Rains In Next Three Days For Two Telugu States
Weather forecast : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతోరాగల మూడు రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటివర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్ధిరంగా కొనసాగుతోందని.. రాగల రెండు రోజుల్లో అది మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఒడిషా, జార్ఖండ్, ఉత్తర చత్తీస్గఢ్ మీదుగా వెళ్లే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఈరోజు ఉత్తర ఒడిషా నుంచి దక్షిణ చత్తీస్గఢ్ ఉత్తర తెలంగాణ, ఉత్తర మధ్య కర్ణాటక మీదుగా అరేబియా సముద్రం వరకు 4.5 నుంచి.. 5.8 కిమీ ఎత్తువరకు ద్రోణి ఏర్పడిందని… వీటి ప్రభావం వలన రాగల మూడు రోజుల్లో తెలంగాణలో పలుప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లోనూ…
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోనూ రాగల మూడు రోజులు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఈరోజు రేపు ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో మూడురోజులపాటు తేలికపాటినుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.