టీడీపీలో విషాదం: కీలక నేత, మాజీ ఎమ్మెల్యే మృతి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు(బుజ్జి) కన్నుమూశారు. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత బుజ్జికి గుండెపోటు రావడంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.
ఆయనను ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలోనే చనిపోయారు. ఆయన మరణవార్త తెలుసుకొన్న టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఆయన ఇంటికి వేలాదిగా చేరుకుంటున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీలో సీనియర్ నేతగా ఉన్నారు బుజ్జి. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరుపున ఏలూరు నుంచి తొలిసారి పోటీచేసి ఓడిపోయారు. తర్వాత టీడీపీలో చేరి 2014లో తిరిగి ఏలూరు నుంచి పోటీ చేసి భారీ విజయం అందుకున్నారు.
గత ఎన్నికల్లో తిరిగి అక్కడ నుంచే పోటీచేసిన ఆయన 4072ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) చేతిలో ఓడిపోయారు. బడేటి బుజ్జి దివంగత సినీ నటుడు ఎస్వీ రంగారావుకు మేనల్లుడు.