28 నుంచి నగరంలో అంతర్జాతీయ సదస్సు
నగరం అంతర్జాతీయ సదస్సుకు ముస్తాబు అవుతోంది. ఆగస్టు 28 నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు ఈ సదస్సు జరుగనుంది. వ్యవసాయం, పశుసంవర్ధక రంగాల్లో సమగ్రాభివృద్ధి, ప్రస్తుత సవాళ్ల పరిష్కారం లక్ష్యంగా సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్ లైఫ్ సైన్స్ సొసైటీ, పసురా గ్రీన్ విజనరీస్ సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి. ప్రపంచ ఆహార భద్రతతో పాటు 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేసే చర్యలను ఈ సదస్సులో చర్చించనున్నట్లు సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ జువ్వాడి దేవీ ప్రసాద్ వెల్లడించారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సైస్ ఆడిటోరియంలో ఈ సదస్సు జరుగనుంది. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, కేంద్ర వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్. ఎస్.కే.మల్హోత్ర, హర్యానా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ కేపీసింగ్, నార్మ్ డైరెక్టర్ డాక్టర్.సి.హెచ్. శ్రీనివాస్ రావు, సెంట్రల్ యూనివర్సిటీ వీసీ ప్రోఫెసర్ పి.అప్పారావు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ వి.ప్రవీణ్ రావు, ఎన్.ఐ.ఆర్.డి. డైరెక్టర్ జనరల్ డాక్టర్ డబ్ల్యూ.ఆర్.రెడ్డిలు తొలి రోజు కార్యక్రమంలో పాల్గొంటారని సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ జువ్వాడి తెలిపారు.
ముగింపు కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ శాఖ కమిషనర్ సి.పార్థసారధి, భారత వరి పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్. ఎస్.ఆర్.వోలేటి పాల్గొంటారని వెల్లడించారు.