CM KCR: తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి.. బీజేపీని నమ్మితే మళ్లీ పాత రోజులొస్తాయి ..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఎన్నో పోరాటాలతో సాధించుకున్నాం. అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటున్నాం.. మోసపోతే గోసపడ్తం.. తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ అన్నారు.
CM KCR: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఎన్నో పోరాటాలతో సాధించుకున్నాం. అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటున్నాం.. మోసపోతే గోసపడ్తం.. తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి అంటూ సీఎం కేసీఆర్ అన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రారంభం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చిన తెలంగాణను మళ్లీ గుంటనక్కలు వచ్చి పీక్కొని తినకుండా, పాత పద్దతికి మళ్లీ పోకుండా, వారి రాజకీయ స్వార్థాలకు బలికాకుండా ఈ తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ఈ క్రమంలో తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
CM KCR Vikarabad Tour : నేడు వికారాబాద్కు సీఎం కేసీఆర్..నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు పడిపోతాయని తప్పుడు ప్రచారంచేశారని, కానీ ఇప్పుడు కర్ణాటకకు మించి భూముల ధరలు పెరిగాయని కేసీఆర్ అన్నారు. ఏ రాష్ట్రంలో లేనన్ని పథకాలు తెలంగాణలో ఉన్నాయని తెలిపారు. రైతాంగాన్ని కాపాడుకోవాలని, పల్లె సీమలు కళకళలాడాలన్నదే మా ఉద్దేశం అని కేసీఆర్ అన్నారు. సంక్షేమ పథకాలను ఉచితాలంటూ కేంద్రం ప్రచారం చేస్తోందని, ఉచిత పథకాలు రద్దు చేయాలంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోందని కేంద్రం తీరుపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోదీ ఎనిమిదేళ్ల పాలనలో చేసిందేమీ లేదన్న కేసీఆర్.. సాక్ష్యాత్తు ప్రధాన మంత్రే తెలంగాణకు శత్రువు అయ్యారని అన్నారు. ప్రధాని నిన్న గంట మాట్లాడాడని, అంతా గ్యాసే అంటూ ఎద్దేవా చేశారు. నెత్తిన రుమాల్ కట్టి వేషం తప్ప ఏమంది, డైలాగులు తప్ప దేశానికి మంచిమాట ఉందా అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. బీజేపీ జెండా పట్టుకొని నా బస్ కు అడ్డం వస్తారా? వికారాబాద్ కు నేనేం తక్కువ చేశానో ప్రజలు చెప్పాలన్న కేసీఆర్.. బీజేపీని నమ్ముకుంటే మనకు మళ్లీ పాతరోజులే వస్తాయంటూ పేర్కొన్నాడు.
కేంద్రంలో బీజేపీ పాలనపై గ్రామాల్లో చర్చ పెట్టాలన్నారు. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వొద్దంట, కానీ, పారిశ్రామిక వేత్తలకు మాత్రం రూ. 20లక్షల కోట్లు దోచి పెడతారు అంటూ కేంద్రం తీరును కేసీఆర్ తప్పుబట్టారు. పాలమూరు – రంగారెడ్డి నీళ్లు తెచ్చే బాధ్యత నాధి, కృష్ణా నదిలో తెలంగాణ నీటి వాటా తేల్చమంటే కేంద్రంలోని బీజేపీ తేల్చడం లేదు, ఇక్కడి బీజేపీ నాయకులు దమ్ముంటే ఢిల్లీ వెళ్లి పాలమూరు – రంగారెడ్డి ఆగిపోయింది, కృష్ణాలో నీటివాటా సంగతి తేల్చాలని అడగాలన్నారు. అయితే వారికి ఆ దమ్ము లేదని, మోదీనిచూస్తే వారికి భయం అంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్ని అడ్డుంకులు సృష్టించినా పాలమూరు – రంగారెడ్డి నిర్మించి తీరుతామని కేసీఆర్ స్పష్టం చేశారు.