మాస్క్ పెట్టుకోకపోతే రూ.12.25లక్షలు జరిమానా..!జైలు కూడా : సర్కార్ స్ట్రాంగ్ వార్నింగ్

  • Published By: nagamani ,Published On : May 18, 2020 / 10:38 AM IST
మాస్క్ పెట్టుకోకపోతే రూ.12.25లక్షలు జరిమానా..!జైలు కూడా : సర్కార్ స్ట్రాంగ్ వార్నింగ్

కరాళ నృత్యం చేస్తున్న కరోనా వైరస్ ను కట్టడికి కువైట్ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి వ్యాపించకుండా అడ్డుకునేందుకు కఠిన నిబంధనల్ని అమలు చేస్తోంది. 

దీనికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాలను.. పాటించని ప్రజలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. సామాజిక దూరం పాటించడంతోపాటు బహిరంగ ప్రదేశాల్లో ముఖాలకు మాస్కులను ధరించాలని ఖతార్ ఇప్పటికే తప్పనిసరి చేసింది. ఒకవేళ ముఖానికి మాస్కు వేసుకోకుండా బైటకు వస్తే.. జేబులే కాదు బ్యాంక్ ఎకౌంట్లు కూడా ఖాళీ అయిపోయేంత జరిమానా విధించాలని నిర్ణయించింది. 

200,000 రియాల్స్ అంటే భారత కరెన్సీలో సుమారు రూ.42లక్షలు జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్షను కూడా విధిస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా కువైట్‌ కూడా ఖతార్ బాటలోనే నడుస్తూ.. మాస్కులు ధరిచంకుండా బైటకొస్తే..5000 దినార్ల అంటే సుమారు రూ. 12.25లక్షల జరిమానాతో పాటు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించనున్నట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 

కాగా.. కువైట్‌లో ఆదివారం (మే 18.2020)  ఒక్కరోజే 1048 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 250 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వగా.. ఐదుగురు మరణించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు కువైట్‌లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 14,850కి చేరింది. మరణించిన వారి సంఖ్య 112కు చేరింది. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు కువైట్ ప్రభుత్వం మరింత కఠిన చర్యల్ని తీసుకుంటోంది.   

Read: ఆమె ప్రపంచ ఛాంపియన్.. ఇప్పుడు కొవిడ్-19 పోరాటంలో వైద్యురాలు!