ప్రేమోన్మాది ఘాతుకం : యువతిపై కత్తితో దాడి చేసి హత్య

  • Publish Date - October 31, 2020 / 11:38 PM IST

young man killed young woman : విశాఖ గాజువాకలో దారుణం జరిగింది. ప్రేమోన్మాదానికి మరో యువతి బలైంది. (అక్టోబర్ 31, 2020) శనివారం శ్రీనగర్ సుందరయ్యనగర్ కాలనీలో ప్రేమోన్మాది అఖిల్ వరలక్ష్మీ అనే యువతిపై కత్తితో దాడి చేశాడు. కత్తితో వరలక్ష్మీ మెడ కోయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా యువతి ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు.



గతంలో కూడా ప్రేమించాలంటూ అఖిల్..వరలక్ష్మీ వెంటపడుతుండేవాడని స్థానికులు అంటున్నారు. యువతి ఒప్పుకోకపోవడంతోనే ఎలాగైనా హతమార్చాలనే ప్లాన్ ముందే రచించుకుని అక్కడికి చేరుకుని మెడ కోశాడు. తీవ్రంగా గాయపడిన వరలక్ష్మీని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఇది దారుణమైన ఘటన అని చెప్పవచ్చు.



వరలక్ష్మీ ఇంటర్ చదువుతోంది. ఒక పెళ్లి వేడుకకు సంబంధించి అన్నయ్య ఇంటికి వెళ్తోంది. అన్నయ్య ఇంటికి వెళ్తున్న క్రమంలో మాట్లాడాలని చెప్పి వరలక్ష్మీని అఖిల్ సుందరయ్యనగర్ లోని సాయిబాబా టెంపుల్ కొండపైకి తీసుకెళ్లాడు. గంటసేపటి వరకు ఆమెతో మాట్లాడారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగినప్పుడు ప్రేమోన్మాది అఖిల్.. వరలక్ష్మీపై దాడి చేశాడు. దాడి చేసిన అనంతరం అఖిల్ పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కొండవైపు ప్రాంతానికి వెళ్లారు.



బట్టలు తీసుకోవడానికి వెళ్తానని చెప్పి గంట సేపైనా ఇంకా రాలేదని వరలక్ష్మీ అన్నయ్య చుట్టు పక్కల వెతుకుతున్న క్రమంలోనే అటువైపు పోలీసులు హుటాహుటిన వెళ్లడం గమనించాడు. వరలక్ష్మీ బంధువులతోపాటు అన్నయ్య కూడా అటువైపు వెళ్తున్న క్రమంలో పోలీసులు అఖిల్ ను అదుపులోకి తీసుకుని వస్తున్నారు.



అఖిల్ చేతులకు రక్తపు మరకలు అంటుకుని ఉన్నాయి. దీంతో అతన్ని ప్రశ్నించిన క్రమంలో అమ్మాయి ఇక్కడ లేదని పోలీసులు చెప్పారు. గట్టిగా నిలదీయండంతో అమ్మాయి మృతి చెందింది…అంబులెన్స్ తీసుకెళ్లి కేజీహెచ్ కు తరలించాలని పోలీసులు చెబుతున్నట్లు బంధువులు అంటున్నారు.



పెళ్లి వేడుకకు హాజరయ్యే హడావిడిలో ఉన్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకోవడంతో వారంతా కన్నీరుమున్నీరవుతున్నారు. యువతి మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీ వద్దకు తీసుకొచ్చారు. సిబ్బంది ఎవరూ లేకపోవడంతో మృతదేహాన్ని బయటే ఉంచారు. అఖిల్ ను సాయిబాబా టెంపుల్ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతన్ని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

 

ట్రెండింగ్ వార్తలు