Afghanistan : పచ్చల లోయ..”పంజ్షీర్” గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
పోరాటాల గడ్డ "పంజ్షీర్".. దీని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సోవియట్ యూనియన్ చేతికి చిక్కకుండా, తాలిబన్ల పాలనకు అందకుండా స్వతంత్రంగా ఉండే అఫ్ఘానిస్తాన్ లో సుందరమైన ప్రాంతం.
Afghanistan : అఫ్ఘానిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తర్వాత మనకు ఎక్కువగా వినిపించిన పదం పంజ్షీర్.. తాలిబన్లు దేశంలోని అన్ని ప్రావిన్సులను స్వాధీనం చేసుకున్నారు కానీ దీనిని తన ఆధీనంలోకి తీసుకోలేకపోయారు. శత్రుదుర్బేధ్యమైన ఈ ప్రాంతం.. ఖనిజ సంపదకు.. రంగురాళ్లకు పుట్టినిల్లు. ఈ ప్రాంతానికి చుట్టూ ఉండే కొండలే దీనికి కొండంత రక్ష.. ఇక్కడి వచ్చి ఈ ప్రాంతాన్ని ఆక్రమించాలంటే తాలిబన్ల ఒక్కరితో సాధ్యం కాదు.. అందుకే ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా, పాకిస్తాన్ సాయం తీసుకోని తాలిబన్లు ఈ ప్రాంతంపై దాడులకు దిగారు.
అఫఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్కు ఈశాన్యంగా 150 కి.మీ. దూరంలో హిందుకుష్ పర్వత సానువుల్లో పంజ్షీర్ లోయ ఉంది. దీనిని అయిదు సింహాల లోయ అని కూడా పిలుస్తారు. ఈ లోయలోకి వెళ్లాలంటే పంజ్షీర్ నది వల్ల ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఒక ఇరుకైన రహదారి మాత్రమే మార్గం. శత్రువు ఎటు నుంచి రావడానికి వీలుకాదు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన మార్గం గుండానే రావాల్సి ఉంటుంది… అందుకే అక్కడి స్థానికులకు ఈ లోయను కాపాడుకోవడం అత్యంత సులభంగా మారింది.
ఈ ప్రాంతం అసలు అఫ్ఘాన్ టిప్ సంబంధం లేనట్టుగానే ఉంటుంది. ఇది స్వతంత్ర రాజ్యంలా అఫ్ఘాన్ నుంచి విడగొట్టినట్లు ఉంటుంది. చారిత్రకంగా చూస్తే పలుమార్లు నిర్ణయాత్మక పాత్రని పోషించింది. మొదట్నుంచి ఎవరికీ తలవంచకుండా సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తున్న ఈ లోయపై ఆధిపత్యం సాధించడానికి తాలిబన్లు ఈసారి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
పోరాటం వారి నైజం.
ఈ ప్రాంతం ఉగ్రవాదుల చేతుల్లోకి కానీ, రష్యా అంతర్యుద్ధం సమయంలో కానీ ఎవరు వశపరుచుకోలేకపోయారు. దీనికి కారణం అక్కడ ఓ బలమైన నాయకుడు ఉండటమే.. అతనే అహ్మద్ షా మసూద్.. 1953 సంవత్సరంలో ఈ లోయలో జన్మించిన మసూద్ .. తనకంటూ ఒక గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇస్లాం మత శక్తులతో పోరాడాడు. 1994 – 2001 వరకు అఫ్ఘాన్ ను తాలిబన్లు వశపరుచుకున్నా..పంజ్షీర్ వైపు కన్నెత్తి చూడలేకపోయారు. దీనికి కారణం అక్కడ మసూద్ సైన్యం ఉండటమే. ఇక ఈ లోయలో చిన్నా పెద్దా అందరు కలిసి 2 లక్షల మంది వరకు నివసిస్తారు.. తాజాగా వలస వచ్చిన వారితో ఈ సంఖ్య 2.1 లక్షలకు చేరింది.
ఈ లోయలో తాజిక్ తెగకు చెందిన వారు. మరోవైపు పాస్తూన్ తెగ వారు ఎక్కువగా ఉంటారు. పాస్తూన్ తెగవారు ఎక్కువగా తాలిబన్ ముఠాలో చేరారు. దీంతో ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణలు రావణకాష్టంలా రగులుతూనే ఉన్నాయి. తాలిబన్లు అధికారంలో ఉన్నప్పుడు మసూద్ శక్తియుక్తులతో వారు ఆ లోయవైపు కన్నెత్తి కూడా చూడలేకపోయారు. మసూద్ మహిళకు కూడా పురుషులకు సమానంగా అవకాశాలు కల్పించాలని కోరేవారు.
ఈ క్రమంలోనే 2001లో మసూద్ ని అల్ ఖైదా ఉగ్రవాదులు దారుణంగా హత్యచేశారు. ఈ ఘటనతో అప్పట్లో పంజ్షీర్ ఉలిక్కిపడింది. మసూద్ మరణం తర్వాత పంజ్షీర్ రక్షణ బాధ్యతలు ఆయన కుమారుడు అహ్మద్ మసూద్ తీసుకున్నారు. తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ లోయను నడిపిస్తున్నారు. మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్, మాజీ రక్షణ మంత్రి బిస్మిల్లా మొహమ్మద్లు కూడా ఆయనకు సహకరిస్తూ లోయను కాపాడుతున్నారు.
ఇక ఈ లోయలో పచ్చలు (ఎమరాల్డ్ ) లభిస్తాయి. ఇవే ఈ ప్రాంతానికి ప్రధాన ఆదాయ వనరు. ఇక అమెరికా నాటో దళాల చేతిలో అఫ్ఘాన్ ఉన్నప్పుడు ఈ లోయ ఎంతగానో అభివృద్ధి చెందింది. ఇంధనానికి హబ్ గా మారింది. అఫ్ఘాన్ లో విద్యత్లో స్వయం సమృద్ధిని సాధించిన ప్రాంతంలో ఇదొక్కటే. పచ్చల గనులతో ఆర్ధికంగా బలంగా ఉండటంతో దీనిని స్వాధీనం చేసుకొని ఆర్ధికంగా లాభం పొందాలని తాలిబన్లు అనుకుంటున్నారు.