High Profit Farming : 10 ఎకరాల్లో వరితో పాటు పసుపు, కూరగాయల సాగు.. పెట్టుబడిలేని సాగుతో లాభాలు పొందుతున్న రైతు
వ్యవసాయ రంగంలో ఎంతో అనుభవం ఉన్న శంకర్ సేంద్రియ వ్యవసాయమే సరయిన దారి అని నమ్మి తమ పూర్వీకుల నుంచి వచ్చిన వ్యవసాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. తనకున్న 10 ఎకరాలలో వరి తో పాటు పలు రకాల కూరగాయలు, పసుపు పంటలను ప్రకృతి విధానంలో సాగుచేస్తున్నారు.
- Guntupalli Ramakrishna
- Published On : June 23, 2023 / 07:00 AM IST
High-Profit Farming
High Profit Farming : పుడమి తల్లిని నమ్ముకుని ప్రకృతి వనరులను వాడుకుంటూ.. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తూ.. రైతే రాజని నిరూపిస్తున్నారు మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ రైతు. అతి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఆర్జిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు . ఇతని సాగు విధానాలను చూసి గ్రామం లోని మిగితా రైతులు కూడా రసాయనిక ఎరువులు లేని ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తూ.. మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.
రసాయన ఎరువుల వాడకం ద్వారా మానవాళికి రానున్న ముప్పును అర్థం చేసుకున్నారు మంచిర్యాల జిల్లా , హాజీపూర్ మండలం, కర్లమామిడి గ్రామానికి చెందిన రైతు బోడ్డు శంకర్. తన తాతముత్తాతలు ఆచరించిన సాగు విధానాలను పాటిస్తు.. 8 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ వివిధ రకాల పంటలను పండిస్తున్నాడు.
రైతు శంకర్ అనే రైతు కుటుంబానిది పూర్తిగా వ్యవసాయ నేపథ్యం, వారి తాత ముత్తాతల నుంచి వ్యవసాయమే వృత్తిగా కొనసాగుతూ వచ్చారు. వ్యవసాయం అంటే ఒక్క పంటల సాగే కాదు… పాడి పశువులను కూడా కలిపితేనే వ్యవసాయం అని అంటారు. కానీ కొందరు ఈ నిర్వచనాన్ని మార్చి పశవులను వ్యవసాయం నుంచి వేరు చేసి విడిగా చూస్తున్నారు. అందుకే తగిన ఫలితాలను పొందలేకపోతున్నారు.
READ ALSO : Crave Crops : పంటలను ఆశించే చీడ పీడలను ఆకర్షించే ఎరపంటలు!
వ్యవసాయ రంగంలో ఎంతో అనుభవం ఉన్న శంకర్ సేంద్రియ వ్యవసాయమే సరయిన దారి అని నమ్మి తమ పూర్వీకుల నుంచి వచ్చిన వ్యవసాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. తనకున్న 10 ఎకరాలలో వరి తో పాటు పలు రకాల కూరగాయలు, పసుపు పంటలను ప్రకృతి విధానంలో సాగుచేస్తున్నారు. వచ్చిన దిగుబడిని చుట్టుప్రక్కలే అమ్ముతూ.. మంచి లాభాలను గడిస్తున్నారు.
రైతులు ఏ పంట సాగుచేసినా రసాయన ఎరువులు, పురుగుమందులపై ఆధారపడాల్సి వస్తోంది. అధిక మొత్తం డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయి గిట్టు బాటు కాని పరిస్థితులు దాపురించాయి. ఫలితంగా రైతులు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. దీనిని అధిగమించేందుకు ఇప్పుడు అందరూ.. ప్రకృతి వ్యవసాయం చేపడుతున్నారు.
