Seeds Plants : చూస్తుండగానే ఖరీఫ్ కాలం దగ్గరపడుతోంది. అక్కడక్కడ వేసవి దుక్కులు చేస్తున్నారు. సీజన్ ప్రారంభానికి మరికొంత సమయం వుంది కనుక, రైతులు ఇప్పటినుంచే వారు వేయబోయే పంటలకు సంబంధించిన విత్తనాల సేకరణలో కాస్త మెళకువగా వ్యవహరించాలి. విత్తు నాణ్యంగా వుంటేనే కదా దిగుబడులు ఆశాజనకంగా వుండేది. అందుకే అంటారు యధా బీజం-తధా సశ్యం అని. మరి, విత్తనాల సేకరణలో రైతులు ఏయే అంశాలను దృష్ఠిలో వుంచుకోవాలి. అసలు వాటి నాణ్యతా ప్రమాణాలను ఏ విధంగా తెలుసుకోవచ్చు. వివరాలు మీకోసం.
Read Also : Agriculture Tips : ఉష్ణోగ్రతలు తగ్గుతున్న సమయంలో పంటల్లో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ
భారతదేశం వ్యవసాయక దేశం. ఇప్పటికీ 70శాతానికి పైగా వ్యవసాయం పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే, నేడు గతి తప్పిన వాతావరణ పరిస్థితుల వలన రైతు ఎన్నో ఒడిదుడుకుల మధ్యనే కర్రు సాగుస్తున్నాడు. ఇప్పటికే పంట పొలాలను సిద్ధం చేస్తున్న రైతులు దృష్ఠి పెట్టాల్సిన మరొక కీలక అంశం – నాణ్యమైన విత్తనాల ఎంపిక . దాదాపు అన్ని రకాల పంటల్లోను హైబ్రీడ్ లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో రైతులు కాస్త మెలకువగా వ్యవహరించాలి.
ముందుగా.. ప్రాంతాలకు అనుగుణంగా, వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా, నీటి లభ్యతను బట్టి పంటలను ఎంచుకోవాలి. తర్వాత సాగుచేయబోయే పంటలో ఏయే రకాలు అందుబాటులో వున్నాయో తెలుసుకోవాలి. విత్తనాలను ప్రభుత్వ సంస్థలు, గుర్తింపు పొందిన అధీకృత డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలి. విత్తన సంచులపై వున్న సమాచారాన్ని పూర్తిగా చదివి, వాటియొక్క జన్యు, భౌతిక స్వచ్చత వివరాలు తెలుసుకోవాలి. 98నుంచి 100శాతం జన్యు స్వచ్చత వున్న విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి.విత్తన బ్యాగులపై వుండే పసుపు, నీలం రంగు ట్యాగులు.
అది బ్రీడర్ విత్తనమా, లేక ఫౌండేషన్ విత్తనామా అనే వివరాలు తెలియజేస్తాయి. కొంతమంది రైతులు ధర తగ్గుతుందని రసీదులు లేకుండా కొనుగోలు చేస్తూ వుంటారు. ఇది ఎంతమాత్రం మంచి పద్ధతి కాదు. విత్తనం కొన్నప్పుడు రశీదు తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకవేళ మొలకశాతం తక్కువగా వున్నా, విత్తనాలు నాశిరకానివైనా, పరిహారం పొందటానకి ఈ బిల్లులు ఎంతగానో ఉపయోగపడతాయి. విత్తనాలను పొలంలో విత్తేముందు వాటియొక్క మొలకశాతాన్ని లెక్కగట్టాలి. దీనికోసం 100 విత్తనాలను తడి గుడ్డలో వేసి, 2,3రోజుల పాటు వుంచాలి. 95శాతానికి పైగా మెలకశాతం వుంటే వాటిని నాణ్యమైనవిగా గుర్తించాలి.
వరి లాంటి పంటల్లో కోత తోసిన వెంటనే విత్తనాలను వాడుకోవాలంటే ముందుగా వాటిలోని నిద్రావస్థను తొలగించాలి. ఇందుకోసం లీటరు నీటికి 6.3మిల్లీలీటర్ల గాఢనత్రకామ్లం కలిపి ఆ నీటిలో 24గంటలు నానబెట్టి, మరొక 24గంటల పాటు మండెకట్టాలి. విత్తేముందు శిలీంధ్రనాశనులతో విత్తనశుద్ధి చేసినట్లయితే.. భూమి ద్వారా వ్యాపించే తెగుళ్ళను అరికట్టిన వాళ్ళమవుతాం.
Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు