Paddy Crop : తెలుగు రాష్ట్రాల్లో ఊపందుకున్న వరినాట్లు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Paddy Crop : తెలుగు రాష్ట్రాల్లో వరినాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే నాట్లు ప్రారంభం కాగా, కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం నారుమడి దశనుండి, నాట్లు దశలో ఉంది.
- Sreehari A
- Published On : August 17, 2024 / 02:38 PM IST
Precautions to be Taken During Paddy
Paddy Crop : తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ వరిసాగు ఊపందుకుంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రైతులు వరి నాట్లు వేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. నారుపీకటం, దమ్ముచేయటం ఇలా మొత్తం మీద వివిధ దశల్లో ఖరీఫ్ పనులు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వరి నాటు వేసే సమయంలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులు ఆశించిన దిగుబడులు సాధించవచ్చని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, తిరుపతి తెలియజేస్తున్నారు.
Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు
తెలుగు రాష్ట్రాల్లో వరినాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే నాట్లు ప్రారంభం కాగా, కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం నారుమడి దశనుండి, నాట్లు దశలో ఉంది. అయితే ఆయా ప్రాంతాలకు అనుగుణంగా దీర్ఘ, మధ్యకాలిక రకాలు ఎంపిక చేసుకుని నారుమళ్లు పోసుకున్న రైతాంగం.. నారు వయసు 30రోజులు దాటకముందే నాట్లు వేయటం మంచిది. నారు ముదిరితే పిలకల సంఖ్య తగ్గిపోతుంది.
అందువల్ల సకాలంలో నాట్లు వేయటం పూర్తిచేయాలి. నాట్లు వేయటానికి 15రోజుల ముందే పొలాన్ని రెండు మూడు దఫాలుగా మురగ దమ్ముచేయాలి. ఎత్తు పల్లాలు లేకుండా పొలమంతా సమానంగా వుండేటట్లు చదును చేయాలి. పొలంలో గట్లు వెడల్పులేకుండా సరిచేయాలి. గట్లు వెడల్పుగా వుంటే కలుపుతో పాటు, ఎలుకల బెడద ఎక్కువ అవుతుంది.
నారు తీసేటప్పుడు మొక్కలు లేతాకుపచ్చగా వుంటే మూన త్వరగా తిరుగుతుంది. నాట్లు వేసేటప్పుడు ఎరువుల యాజమాన్యం, మొక్కల సాంద్రత, కలుపు, నీటియాజమాన్య పద్దతులను, దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడులు పొందవచ్చని రైతులకు సూచిస్తున్నారు మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, తిరుపతి.
Read Also : Agri Tips : ఖరీఫ్కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు
