Vegetable Protray : నాణ్యమైన దిగుబడి పొందాలంటే ఆరోగ్యకరమైన నారు అవసరం. మనం నాటే మొక్కలు పొలంలో కుదురుకొని త్వరగా ఎదగాలంటే, నారు నాణ్యంగా దృడంగా ఉండాలి. సాధారణంగా రైతులు కూరగాయల నారును సంప్రదాయ బద్దంగా పెంచి , ప్రధాన పొలంలో నాటుతుంటారు.
Read Also : Agriculture Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న యువకుడు
అయితే వాతావరణ ఒడిదుడుకులకు లోనవడం.. అధిక వర్షాలు కురిసినప్పుడు నారుకుళ్లు సంభవించి , రైతులు నష్టపోయే ప్రమాదముంది. ఈ సమస్యలను అధిగమించేందుకు రైతులు షేడ్ నెట్ కింద ప్రోట్రేలలో పెంచిన నారువైపు చూస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే కొందరు రైతులు షేడ్ నెట్ నర్సరీలు ఏర్పాటు చేసి రైతులకు అందిస్తూ.. మంచి లాభాలను పొందుతున్నారు.
పంటల దిగుబడి ఆరోగ్యవంతమైన నారుమడి పెంచడం పైనే ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడులు పొందడానికి నారుమడి దశలోనే రైతాంగం శ్రద్ధ వహించాలి. ఇప్పుడు నూటికి 90శాతంమంది రైతులు హైబ్రిడ్ విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రతి విత్తనాన్ని మొక్కగా మలిచేటట్లు చూసుకోవాలి. కానీ చాలా వరకు సంప్రదాయ పద్ధతిలోనే నారును పెంచుతున్నారు. దీనివల్ల ప్రతికూల పరిస్థితుల్లో చీడపీడలు ఆశించి, నాణ్యమైన నారు అందక, ఇటు పెట్టుబడి, అటు సమయం వృదా అవుతుంది.
ఈ సమస్య నుండి బయట పడాలంటే షేడ్ నెట్ లకింద ప్రోట్రేలలో నారు పెంచే విధానం ఉత్తమమైన మార్గమని రైతులు గ్రహించారు. అందుకే చాలా మంది రైతులు నర్సరీలపై ఆదారపడి సాగును కొనసాగిస్తున్నారు. అయితే అందుకు తగ్గట్టుగానే ప్రతి జిల్లాల్లో నర్సరీలు వెలిశాయి. ఈ కోలోనే ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు 3 ఎకరాల భూమిలో ప్రభుత్వ సహాకారంతో షేడ్ నెట్ ఏర్పాటు చేసి, ప్రోట్రేలలో నారు పెంచుతూ.. స్వయం ఉపాధి పొందుతున్నారు. అంతే కాదు కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు.
ప్రోట్రేలలో నారును పెంచటం వలన ప్రతీ విత్తనం నారుమొక్కగా అందివస్తుంది. షేడ్ నెట్ లలో వాతావరణం నియంత్రణలో వుంటుంది కనుక చీడపీడలు సోకే అవకాశం చాలా తక్కువగా వుంటుంది.నారు మొక్కల్లో వేరువ్యవస్థ సమానంగా పెరగటం వల్ల ప్రధానపొలంలో నాటినపుడు ఎలాంటి ఒత్తిడికి గురికావు. నాటిన వెంటనే పెరుగుదలకు అవకాశం వుంటుంది కనుకు దిగుబడులు ఆశాజనకంగా వుంటాయి.
Read Also : Rice Varieties : మేలైన మధ్యకాలిక.. దొడ్డు, సన్నగింజ వరి రకాలు