Pawan Kalyan – Eluru : ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణ జరుగుతోందని, ఇందుకు కారణం వైసీపీ వాలంటరీ వ్యవస్థ అని, ఇందులో వైసీపీ పెద్దల హస్తం కూడా ఉందని పవన్ కల్యాణ్ ఆరోపణలు చేశారు. ఈ విషయం కేంద్ర నిఘా వర్గాలే తనతో చెప్పాయని పవన్ అన్నారు.
”రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ అవటానికి వాలంటీర్ వ్యవస్థ పని చేస్తోంది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒంటరి మహిళల సమాచారం రాష్ట్ర ప్రభుత్వం సేకరించి సంఘ విద్రోహ శక్తులకు ఇస్తోంది. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో మహిళలు మిస్సింగ్ అవుతున్నారు. కేంద్ర నిఘా వర్గాలు ఈ సమాచారం ఇచ్చాయి” అని ఏలూరులో వారాహి విజయ యాత్ర బహిరంగ సభలో పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు.
”ప్రతి గ్రామంలో ఎవరు ఎవరి మనిషి? ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు? ఆడపిల్లలు ఎవరినైనా ప్రేమిస్తున్నారా? వారిలో వితంతవులు ఉన్నారా? ఇలా వాలంటీర్లు సమాచారం సేకరించి.. సంఘ విద్రోహ శక్తులకు చేరవేయడంతో ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. ఇందులో వైసీపీ పెద్దల హస్తం కూడా ఉంది. ఈ విషయంపై కేంద్ర నిఘా వర్గాలు నన్ను హెచ్చరించాయి” అని పవన్ కల్యాణ్ అన్నారు.
”రాష్ట్రంలో మహిళలపై ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. 30వేల మంది అమ్మాయిలు రాష్ట్రంలో మిస్ అయ్యారు. ఎన్సీఆర్ బీ 29వేల మంది మిస్ అయ్యారని రిపోర్ట్ ఇస్తే.. 14వేల మంది తిరిగొచ్చారని రాష్ట్ర పోలీసులు చెప్పారు. మరి మిగతా వాళ్లు ఏమయ్యారు? ” అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
”చెత్త ఎత్తే వాళ్ళపై కూడా చెత్త పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్. గెలుపోటములు నాకు తెలీదు. పోరాటం మాత్రమే తెలుసు. రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారు. వారిలో 14వేల మంది తిరిగి వచ్చారని చెప్తున్నారు. మిగిలిన వారి సంగతేంటి? మీ ఇంట్లో ఆడపడుచు అదృశ్యమైతే ఇలాగే ఉంటావా జగన్? దీనిపై జగన్, డీజీపీ ఎందుకు సమీక్ష చేయలేదు? ఆడబిడ్డల ఉసురు తీస్తున్నారు జగన్.
చెత్త పన్నుతో సహా అన్ని పన్నులతో దోచేస్తున్న జగన్ దారి దోపిడీ దొంగలతో సమానం. ఎండిపోయిన గుండెలు నాయకుల కోసం చూస్తాయి. అలా జగన్ కోసం చూశారు. కానీ జగన్ ఏం చేశాడు? 18 ఏళ్ల వయసులో 25 ఏళ్ళు నిండకుండానే చనిపోతా అనుకున్నా. ఎందుకంటే నాలో ఉన్న జ్వలనం పోరాటం.
Also Read..Purandeswari: విశాఖ ఎంపీ స్థానం నుంచి పురంధేశ్వరి పోటీచేస్తారా.. జీవీఎల్ పరిస్థితి ఏంటి?
నేను చావడానికి సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చా. నన్ను గెలిపించినా లేకున్నా ఈ నేల కోసం పోరాడతా. మళ్లీ ఓడినా పవన్, జనసేన పోరాటం ఆగదు. ప్రాణాలకు తెగించి ఉన్న నాకు, నా వాళ్ళని తిట్టినా పట్టించుకోను. నువ్వు విలువలు లేని వాడివి. నువ్వో క్రిమినల్. అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి. అరాచకాలు పోవాలన్నా, జనం బాగుండాలన్నా జగన్ పోవాలి. హలో ఏపీ… బై బై వైసీపీ” అని పవన్ అన్నారు.