Janasena Pawan Kalyan : చీరాల మాజీ ఎమ్మెల్యే,వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు జనసేన పార్టీలో చేరనున్నారు. దీని కోసం స్వాములు మంచి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. దీంట్లో భాగంగానే జూన్ 12న పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ వారాహి యాత్రకు ముందే అంటే 12న మంగళగిరి లోని పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ నిర్వహించే పూజా సమయంలోనే జనసేన పార్టీలో చేరాలని ఆమంచి స్వాములు నిర్ణయించుకున్నారు.
చీరాలలో తన నూతన గృహప్రవేశం రోజున పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించి బహిరంగ సభ పెట్టాలని ఆమంచి స్వాములు ముందు భావించారు. కానీ సమయాభావం కుదరక పోవడంతో వారాహి యాత్రకు ముందే జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తాను జనసేనలో చేరే విషయంపై గురువారం (జూన్ 8,2023) చీరాలలో కీలక భేటి నిర్వహించనున్నారు.
జనసేన నుండి తనకు సీటు ఇచ్చిన ఇవ్వకపోయినా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని పవన్ కల్యాణ్ విధానాలు నచ్చి..ఆయన ఆలోచనలు నచ్చి పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. జనసేన పార్టీ బలోపేతం కోసమే తాను పనిచేయాలని పదవుల కోసం కాదని తెలిపారు. కానీ పార్టీ టికెట్ ఇస్తే పోటీలో ఉంటానని..టికెట్ ఇవ్వకపోయినా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని తెలిపారు.చీరాల పర్చూరు రాజకీయాలలో తన సోదరుడు మాజీ ఎమ్మెల్యే..ప్రస్తుత వైసీపీ నేత ఆమంచి కృష్ణ మోహన్ ఉన్నందున ఇక్కడ నుండి పోటీచేసే బదులు గిద్దలూరు నుండి అవకాశం కల్పిస్తే పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు ఆమంచి స్వాములు.
కాగా ఆమంచి కృష్ణ మోహన్ కాంగ్రెస్ సభ్యునిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 2000లో వేటపాలెం మండలం నుండి ZPTC సభ్యునిగా ఎన్నికయ్యారు. అలా అంచెలంచెలుగా ఎదిగి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. టీడీపీ అభ్యర్థిపై వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ప్రస్తుతం వైసీపీ చీరా నియోజకవర్గం ఇన్ చార్జ్ గా కొసాగుతున్నారు. ఆయన సోదరుడే ఆమంచి స్వాములు. త్వరలోనే జనసేనలో చేరనున్నారు.