Galla Jayadev: అమరరాజా బ్యాటరీ కంపెనీ షాక్‌.. మూసేయాలంటూ ఆదేశాలు

  • Updated on- May 1, 2021 / 06:53 PM IST

Galla Jayadev

Amara Raja Group: అమర రాజా బ్యాటరీ కంపెనీకి ఏపీ పొల్యూషన్‌ బోర్డు(APPCB) షాక్‌ ఇచ్చింది. కాలుష్య నిబంధనలు పాటించని కారణంగా అమర రాజా బ్యాటరీ కంపెనీలను మూసేయాలని ఆదేశాలిచ్చింది. ఫ్యాక్టరీ నుంచి లెడ్‌ విడుదల అవుతుండటంతో.. చుట్టుపక్కల తీవ్ర జలకాలుష్యం జరుగుతోందని నోటీసులో పేర్కొంది పీసీబీ. చిత్తూరు జిల్లాలోని కరకంబాడీ, నూనెగుండాలపల్లె యూనిట్లను మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ప్రతిపక్ష టీడీపీలో దూకుడుగా ముందుకు సాగే ఎంపీ గల్లా జయదేవ్‌.. ఆయన కుటుంబం దశాబ్దాల నుంచి పలు వ్యాపారాలలో సక్సెస్ ఫుల్ గా రాణిస్తోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా బేస్ చేసుకొని నడిచే అమరరాజా బ్యాటరీస్ దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడు ఆ అమరరాజా సంస్థకు చెందిన ప్లాంట్లను మూసివేయాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ సంస్థకు చెందిన చిత్తూరు జిల్లాలోని ప్లాంట్లు మూసివేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్​ పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు ఆదేశించింది.

అమరరాజా గ్రూప్ సంస్థకు తిరుపతి సమీపంలోని కరకంబాడి, చిత్తూరు దగ్గరున్న నూనెగుండ్లపల్లిలో ఉత్పత్తి ప్లాంట్లు ఉన్నాయి. ఈ రెండు ప్లాంట్ల నుండి మితిమీరి వాతావరణ కాలుష్యమవుతుందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్ధారించుకుని రెండు ప్లాంట్లను మూసేయాలని ఆదేశించినట్లు అమరరాజా సంస్థ చెప్పింది.