Amit Shah: దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించిన అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజనకు సంబంధించి నెలలో కార్యాచరణ సిద్ధం చేయాలని అమిత్ షా ఆదేశించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ముఖ్యమంత్రులు, గవర్నర్లు, లెఫ్ట్నెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు, మంత్రులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఏపీ డిమాండ్స్ను గట్టిగా వినిపించారు సీఎం జగన్. ఏపీ, తెలంగాణల మధ్య అపరిష్కృత సమస్యలను వీలైనంత త్వరగా సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇటు తెలంగాణ నుంచి హాజరైన హోంమంత్రి మహమూద్ అలీ కూడా తెలంగాణకు కేంద్రం అన్ని విధాలుగా సంపూర్ణ సహకారాలు అందించాలని కోరారు. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందకపోయినప్పటికీ సీఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుందని అన్నారు.
కేంద్ర నుంచి తగు సహకారం లభిస్తే తెలంగాణ మరింత అద్భుతాలు సృష్టిస్తుందని అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రం హామీలను నెరవేర్చాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా దృష్టికి తీసుకెళ్లారు