తిరుమల శ్రీవారికి నైవేద్యంగా 20 బంగారం బిస్కెట్లు.. అజ్ఞాత భక్తుడు భూరి విరాళం

  • Publish Date - July 13, 2020 / 06:32 PM IST

తిరుమల వెంకటేశ్వరస్వామికి ఓ అజ్ఞాత భక్తుడు భూరి విరాళం అందజేశాడు. శ్రీవారికి నైవేద్యంగా 20 బంగారం బిస్కెట్లను సమర్పించాడు. శనివారం నాటి లెక్కింపులో ఈ బంగారం బిస్కెట్లు బయటపడ్డాయి. ఈ విషయాన్ని టీటీడీ ఎగ్జిక్యూటివ్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఒక్కొక్క బిస్కెట్ 2 కిలో గ్రాముల బరువుతో ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.16.7 కోట్లు ఉంటాయని అధికారులు అంచనా.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నాలుగు నెలలపాటు తిరుమల దేవస్థానాన్ని మూసివేశారు. (జూన్ 11, 2020) ఆలయం తిరిగి తెరిచినప్పటి నుంచి ఇదే అతిపెద్ద విరాళం కావడం విశేషం. లాక్ డౌన్ అనంతరం దేవస్థానం తెరిచిన తర్వాత నుంచి నేటి వరకు సుమారు 2.5 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకుంటున్న 67,000 మంది యాత్రికులు వివిధ కారణాల వల్ల పూజకు రాలేదని అధికారులు పేర్కొన్నారు.

ఏపీలో వేగంగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. దీని ప్రభావం తిరుమల ఆలయంపై కూడా పడింది. ఆలయంలో పని చేస్తున్న ఉద్యోగుల్లో 91 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. ఇప్పటివరకు 3,569 మంది ఉద్యోగులను పరీక్షించారు. ఉద్యోగులలో కరోనా వైరస్ వ్యాప్తిని కనుగొన్న తర్వాత నిర్వహణ మరింత అప్రమత్తంగా చేపడుతున్నారు.