Jagananna Vidya Deevena : విద్యార్థుల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన కింద మూడో త్రైమాసికం నిధులను మంగళవారం విడుదల చేసింది. క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ డబ్బులను విడుదల చేశారు.
- kunduru Vinod
- Published On : November 30, 2021 / 04:12 PM IST
Jagananna Vidya Deevena
Jagananna Vidya Deevena : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన కింద మూడో త్రైమాసికం నిధులను మంగళవారం విడుదల చేసింది. క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి విద్యాదీవెన డబ్బులను విడుదల చేశారు. ఈ డబ్బు నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలో పడుతుంది. ఇక ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ పథకం వల్ల 11.03 లక్షల మంది విద్యార్థులకు మేలు జరుగుతుందని తెలిపారు. మూడో త్రైమాసికం పూర్తయిన వెంటనే నేరుగా తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నామన్నారు సీఎం జగన్. తమ ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్మెంటే కాక, గత ప్రభుత్వ బకాయిలు రూ.1778 కోట్లతో కలిపి రూ.6259 కోట్లు చెల్లించిందని వెల్లడించారు.
చదవండి : CM Jagan : జనంలోకి జగన్.. డిసెంబర్ 2 నుంచి నేరుగా…
విద్యాదీవెన, వసతి దీవెన ఈ రెండు పథకాలకు కలిపి ఈ రెండు ఏళ్లలో రూ.8500 కోట్లకుపైగా ఇచ్చామని వెల్లడించారు. జగనన్న వసతి దీవెన కింద ఐటీఐ చదివేవారికి రూ.5వేలు, పాలిటెక్నిక్ చదివేవారికి 15 వేలు, డిగ్రీ, ఇతర కోర్సులు చదివేవారికి 20వేల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ.2267 కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు. 2019 నుంచి ఇప్పటివరకూ కొత్తగా మరో 10 డిగ్రీలు కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు జగన్. రాష్ట్ర వ్యాప్తంగా 154 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో రూ.880 కోట్లతో నాడు – నేడుకు శ్రీకారం చుడుతున్నామని.. మరో రెండేళ్లలో ఈ పనులన్నీ పూర్తి అవుతాయని తెలిపారు.
చదవండి : CM Jagan Goshala : సీఎం జగన్ నివాస ప్రాంగణంలో గోశాల.. అప్డేటేడ్ టెక్నాలజీతో నిర్మాణం
మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతూ.. కొత్తగా 16 మెడికల్ కాలేజీలు తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. విజయనగరం జిల్లాల్లో గురజాడ జేఎన్డీయూ యూనివర్శిటీ, ఒంగోలులో ఆంధ్రకేసరి యూనివర్శిటీని.. కడపలో ఆర్కిటెక్చర్ యూనివర్శిటీ.. కురుపాంలో ఇంజినీరింగ్ కాలేజీ, సాలూరులో ట్రైబల్ యూనివర్శిటీ, పాడేరులో మెడికల్ కాలేజీని తీసుకొస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. విద్యార్థులకు మేనమామలా.. వారి తల్లులకు సోదరుడిలా ఉంటానని మరోసారి తెలిపారు జగన్. ప్రభుత్వం ఖాతాల్లో వేసిన డబ్బుతో మీ పిల్లల కాలేజీ ఫీజులు చెల్లించాలని తెలిపారు. వీటిని వ్యక్తిగత అవసరాలకు వాడుకొని విద్యార్థులను విద్యకు దూరం చెయ్యొద్దని తెలిపారు జగన్. పాదయాత్రలో ఫీజుకట్టలేని విద్యార్థులను చూశానని.. విద్యాకానుక ఆలోచన వచ్చిందని తెలిపారు.
