Andhra pradesh : ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల తిప్పలు.. రావాల్సిన బకాయిల కోసం గవర్నర్ను కలిసి ఉద్యోగుల సంఘాల నేతలు
ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను కూడా సకాలంలో చెల్లించడం లేదని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు గవర్నర్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు.
- nagamani
- Published On : January 19, 2023 / 01:42 PM IST
Andhra pradesh Employees unions leaders meet governor
Andhra pradesh : ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఫస్టు తారీఖు వెళ్లినా జీతాలు రాని పరిస్థితి. జీతం ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూడాల్సిన దుస్థితి. అంతేకాదు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల గురించి కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేని ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల దుస్థితి అంతా ఇంతా కాదు. దీంతో తమకు రావాల్సి బకాయిల కోసం ఉద్యోగ సంఘాల నేతలు తమ గోడును గవర్నర్ కు విన్నవించుకున్నారు. తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వచ్చేలా చర్యలు తీసుకోండి సార్ అంటూ గవర్నర్ బిశ్వభూషన్ కు కలిసారు ఉద్యోగ సంఘాల ప్రతినిథులు.
ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను కూడా సకాలంలో చెల్లించడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు గురువారం (జనవరి 19,2023) రాజ్భవన్లో గవర్నర్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలను… పేరుకుపోయిన జీపీఎఫ్, మెడికల్ క్లయిమ్స్, డీఏ లతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ప్రభుత్వం చెల్లించడం లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు వాపోయారు. వెంటనే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వానికి మార్గనిర్దేశనం చేయాలని గవర్నర్ ను కోరారు. తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని లేదంటే తదుపరి తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా పట్టించుకోవటంలేదని వేరే దారి లేక గవర్నర్ ను కలిసి మా పరిస్థితి గురించి విన్నవించుకున్నామని తెలిపారు.
