Andhra Pradesh three capitals: ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల విషయంలో వైసీపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా పాలనా రాజధాని విశాఖలో పెట్టే పనులను ముమ్మరం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మూడు రాజధానుల అంశంపై చర్చ జరగగా.. వైసీపీ కీలక నేతల వ్యాఖ్యలు చూస్తుంటే త్వరలోనే మూడు రాజధానుల పాలన అమల్లోకి వచ్చేట్టు కనిపిస్తోంది.
ఏపీలో మూడు రాజధానుల అంశం మరోసారి చర్చకు రాగా.. త్వరలో విశాఖ పాలనా రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు జ్యుడీషియల్ క్యాపిటల్గా వెంటనే అమల్లోకి తీసుకుని రావాలని ప్రభుత్వం యోచిస్తోంది. వీటికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం చట్టం కూడా చేయగా.. కేంద్రం ప్రభుత్వం నుంచి పాలన అనుమతులు రావాల్సి ఉంది. జగన్ ఢిల్లీ టూర్లో అమిత్ షాతో ఈఅంశంపైనే చర్చ జరిగింది.
ఈమేరకు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. త్వరలో పాలనా అనుమతులు వస్తాయని చెప్పడంతో మూడు రాజధానులకు లైన్ క్లియర్ అవుతుందని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. అధికార వికేంద్రీకరణ చేయడం ఖాయమన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. త్వరలోనే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని, మూడు రాజధానుల నిర్ణయం పంతానికి చేసింది కాదన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వం లక్ష్యం అన్నారు.