ysr bheema : బ్యాంకు ఖాతాల్లో ప్రీమియం, పథకం ప్రయోజనాలు

  • Publish Date - October 21, 2020 / 08:41 AM IST

andhra pradesh ys jagan announced ysr bheema : ఏపీలో మరో పథకం ప్రారంభం కానుంది. వైఎస్సార్‌ బీమా పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ మేరకు ప్రకటించారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రీమియం మొత్తం జమ చేస్తామని, వారం రోజుల్లో ఖాతాలకు చేరుతుందని చెప్పారు.



ఈ పథకంలో ప్రతి ఒక్కరికి బ్యాంక్‌ ఖాతా ఉండాలని స్పష్టం చేశారు. నిరుపేద కుటుంబాలకు జీవన భద్రత కల్పిస్తూ కష్టకాలంలో ఆదుకునేలా వైఎస్‌ఆర్‌ బీమా పథకాన్ని తీసుకొచ్చింది. బియ్యం కార్డులున్న కుటుంబాలను ఆపత్కాలంలో ఆదుకోనుంది. సీఎం వైఎస్‌ జగన్‌ 2020, అక్టోబర్ 21వ తేదీ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

కుటుంబ పెద్ద సాధారణంగా లేక ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడకుండా ఆదుకునేలా ప్రభుత్వం వైఎస్సార్‌ బీమా పథకాన్ని రూపొందించింది. లబ్ధిదారుల తరఫున బీమా సంస్థలకు 510 కోట్లకు పైగా ప్రీమియం చెల్లిస్తోంది.



ప్రయోజనాలు : –
బియ్యం కార్డులు కలిగిన వారు మాత్రమే ఈ బీమాకు అర్హులు. 18 నుంచి 70 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండి కుటుంబాన్ని పోషించే వారికి ఈ పథకం వర్తిస్తుంది.

18 – 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న లబ్ధిదారుడు సహజ మరణం పొందితే రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి రూ.5 లక్షలు చొప్పున బీమా పరిహారం చెల్లిస్తారు.

లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు పూర్తి అంగవైకల్యం పొందితే రూ.5 లక్షలు బీమా పరిహారం అందిస్తారు.



51 – 70 ఏళ్ల మధ్య వయసు లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి రూ.3 లక్షలు పరిహారం లభిస్తుంది.

శాశ్వత అంగవైకల్యం పొందితే రూ.3 లక్షలు బీమా పరిహారం అందుతుంది.
18 – 70 సంవత్సరాల వయసు గల లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు పాక్షిక /
శాశ్వత అంగ వైకల్యానికి గురైతే రూ.1.50 లక్షల బీమా పరిహారం అందిస్తారు.



నిరుపేద కుటుంబాలకు మేలు చేయాలన్న సంకల్పంతో వైఎస్సార్‌ బీమా పథకాన్ని అమలు చేయాలని సీఎం జగన్‌ నిర్ణయించారు.