మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బిగ్షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
- Harishth Thanniru
- Updated on- June 19, 2025 / 11:11 AM IST
Ambati Rambabu
Ambati Rambabu: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బుధవారం పల్నాడు జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతోపాటు.. పోలీసుల పట్ల మాజీ మంత్రి అంబటి రాంబాబు దురుసుగా ప్రవర్తించారని పేర్కొంటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో వైసీపీ కార్యకర్త నాగమళ్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు హాజరయ్యారు. జగన్ పర్యటన నేపథ్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొర్రపాడు బోర్డర్ వద్ద పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. అనుమతి ఉన్న వాహనాలు మాత్రమే వెళ్లాలంటూ జగన్ వెంట వస్తున్న వాహనాలను బారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వివాదంకు దిగారు. తానే స్వయంగా బారికేడ్లను తొలగించి జగన్ కాన్వాయ్ కు రూట్ క్లియర్ చేశారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతోపాటు, పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారని పోలీసులు అంబటిపై 188, 332, 353, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
