×
Ad

Andra Pradesh : మంత్రివర్గ విస్తరణ తర్వాత..నెల్లూరు వైసీపీలో పెను మార్పులు..ఏ పరిణామాలకు దారితీయనున్నాయ్?

Apలో మంత్రివర్గ విస్తరణ తర్వాత..నెల్లూరు వైసీపీలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉప్పు నిప్పుగా ఉండే వైసీపీ నేతలు భేటీ అవ్వటం..ఏ పరిణామాలకు దారితీయనున్నాయ్? అనే ప్రశ్న వస్తోంది

  • Published On : April 16, 2022 / 02:52 PM IST

Expansion Of The Cabinet .. Nellore Ycp Major Changes

expansion of the cabinet .. Nellore YCP major changes : నెల్లూరు జిల్లాలో.. కేబినెట్ విస్తరణ చిచ్చు పెట్టిందా? కొత్తగా మంత్రి బాధ్యతలు చేపట్టిన.. కాకాణి గోవర్దన్ రెడ్డికి వ్యతిరేకంగా.. జిల్లా ఎమ్మెల్యేలు ఏకమవుతున్నారా? మాజీ మంత్రి అనిల్, ఎమ్మెల్యే కోటంరెడ్డి భేటీ ఇస్తున్న సిగ్నలేంటి? జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలతో.. కాకాణికి ఎలాంటి రిలేషన్ ఉంది? మంత్రి గోవర్దన్ గురించి.. వాళ్లేమనుకుంటున్నారు? మంత్రివర్గ విస్తరణ తర్వాత.. నెల్లూరు వైసీపీలో కనిపిస్తున్న మార్పులు.. మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయ్. ఈ జిల్లానే..

వైసీపీ ఏర్పాటైన దగ్గర్నుంచి.. పార్టీని బాగా ఆదరిస్తున్న జిల్లాల్లో నెల్లూరు ఒకటి. గత ఎన్నికల్లో.. జిల్లాలో పదికి పది.. అసెంబ్లీ స్థానాలు.. ఫ్యాన్ ఖాతాలోనే పడ్డాయ్. అలాంటి జిల్లాలో.. కేబినెట్ విస్తరణ తర్వాత కనిపిస్తున్న రాజకీయ పరిణామాలు.. రోజురోజుకు ఆసక్తి రేపుతున్నాయ్. ఎప్పటి నుంచో ఉప్పూ-నిప్పులా ఉండే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమావేశం.. జిల్లా రాజీకీయాల్లో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ కోటంరెడ్డిని.. అనిల్ ఇంటికెళ్లి మరీ కలవడంపై.. రకరకాల ఊహాగానాలొస్తున్నాయ్.

Also read : AP : ఆసక్తికరంగా నెల్లూరు వైసీపీ రాజకీయాలు..కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భేటీ

ఈ వరుస పరిణామాలకు కారణం.. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డికి మంత్రి పదవి దక్కడమేనన్న చర్చ జరుగుతోంది. అనిల్ మంత్రి అయిన దగ్గర్నుంచి.. కాకాణితో పడేది కాదనే టాక్ ఉంది. ప్రత్యక్షంగా.. వీళ్ల మధ్య శత్రుత్వాలు, గొడవలేమీ లేకపోయినా.. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ మాత్రం కొనసాగుతోందన్నది ఓపెన్ సీక్రేట్. ఇప్పుడు అనిల్ మాజీ మంత్రిగా మారిపోవడం.. కాకాణి మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో.. జిల్లాలో సీన్ రివర్స్ అయింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన కొత్త విషయమేమిటంటే.. కాకాణి అంటే పడని అనిల్‌, మంత్రి పదవి ఆశించి భంగపడ్డ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరూ.. ఒక్కటైపోయినట్లు తెలుస్తోంది.

Also read : Andhra pradesh : మాజీ మంత్రుల కోసం కొత్త మంత్రుల అధికారాలకు కోత..! పదవిలో ఉన్నా అధికారం లేనట్లేనా?!

నెల్లూరు జిల్లా మొత్తంలో.. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి మాత్రమే కాకాణికి మద్దతుగా ఉన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో.. ఒక స్థానం ఖాళీగా ఉంది. మిగిలిన ఎమ్మెల్యేల సంగతేమిటన్నదే ఇప్పుడు ఇంట్రస్టింగ్ పాయింట్. అయితే.. జిల్లా వైసీపీలో వినిపిస్తున్న గుసగుసలను బట్టి చూస్తే.. మిగతా ఐదుగురు ఎమ్మెల్యేలతోనూ కాకాణికి పెద్దగా సత్సంబంధాలు లేవంటున్నారు. కాబట్టి.. మున్ముందు మంత్రి వ్యవహారశైలి ఆధారంగానే.. ఎమ్మెల్యేల వైఖరి ఆధారపడి ఉంటుందని కేడర్‌లో చర్చ సాగుతోంది.

ప్రస్తుతానికి పార్టీలో అంతర్గతంగా ఉన్న ఈ విభేదాలు.. చివరికి వచ్చే ఎన్నికల మీద పడుతుందేమోనన్న ఆందోళన కూడా నాయకత్వంలో మొదలైంది. జిల్లాలో ఆధిపత్యం కోసం.. ఒకరినొకరు దెబ్బకొట్టేందుకు.. మరొకరు ప్రయత్నిస్తే.. అంతిమంగా నష్టపోయేది పార్టీయేనని చెబుతున్నారు. ఈ పరిస్థితి రావొద్దంటే.. సీఎం జగన్ ఈ ఇష్యూలో కలగజేసుకొని మొదట్లోనే దీనిని తుంచేయాలన్న గుసగుసలు వినిపిస్తున్నాయ్. మంత్రికి, ఎమ్మెల్యేలకు మధ్య ఉన్న విభేదాలను సెట్ చేయకపోతే.. మున్ముందు గొడవలు మరింత పెరిగిపోతాయ్. అప్పుడు.. ఎవరు జోక్యం చేసుకున్నా పరిస్థితిని చక్కదిద్దే అవకాశం ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.