Rs.8 lakh robbery in ps : పోలీస్ స్టేషన్ కే కన్నం వేసిన దొంగ ..రూ.8 లక్షలు దోపిడీ
- nagamani
- Updated on- March 17, 2021 / 01:58 PM IST
Ap Rs.8 Lakh Robbery In Veeravasaram Ps
AP Rs.8 lakh robbery in Veeravasaram Police Station : ప్రజల ఇళ్లల్లో దొంగతనాలు జరిగితే పోలీసులకు చెప్పుకుంటారు. మా ఇంట్లో చోరీ జరిగింది సార్..మా సొమ్ము మాకు ఇప్పించండీ సార్ అని వేడుకుంటారు. కానీ ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే చోరీ జరిగితే..అదేంటీ ఏ దొంగ అయినా పోలీస్ స్టేషన్ లో చోరీ చేస్తాడా? ఎంత ధైర్యం అనుకోవచ్చు.
కానీ ఈ దొంగ మామూలోడు కాదు. ఏకంగా పోలీస్ స్టేషన్ కే కన్నం వేశాడు. పోలీసులకు మస్కా కొట్టి రూ.8లక్షలు దోచుకెళ్లిపోయాడు. దీంతో పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. ఈ విషయం బయటకు తెలిస్తే పరువేమైపోతుందోనని మదన పడ్డారు.కానీ గుట్టు రట్టు అయ్యింది ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పోలీస్ స్టేషన్ లో చోరీ జరిగిందనీ..రూ.8 లక్షల రూపాలు చోరీకి గురయ్యాయనే విషయం బైటపడింది.
వివరాల్లోకి వెళితే..పశ్చిమగోదావరి జిల్లాలోని వీరవాసరం పోలీస్ స్టేషన్ లో ఓ దొంగ చోరీకి పాల్పడి రూ.8 లక్షలు దోచేశాడు. పోలీస్ స్టేషన్ లో ఇంత డబ్బు ఎక్కడిదంటే..గత కొన్ని రోజులుగా బ్యాంకులకు వరుస సెలువులు వచ్చాయి. దీంతో ఏపీలోని ప్రభుత్వ దుకాణాల్లో మద్యం అమ్మిన డబ్బును వీరవాసరంలోని పోలీస్ స్టేషన్ లో భద్రపరిచారు ఎక్సైజ్ సిబ్బంది.
ఈ విషయం మరి ఆ దొంగకు ఎలా తెలిసిందో గానీ..పోలీస్ స్టేషన్ పై తన ప్రతాపాన్ని చూపాడు. రాత్రికి రాత్రి మొత్తం ఎక్సైజ్ శాఖకు చేరాల్సిన రూ.8లక్షల సొమ్మును దోచేశాడా దొంగ. మరి ఆ దొంగకు ఎంత ధైర్యం ఉంటే పోలీస్ స్టేషన్ కే కన్నవేసి పోలీసులకు మస్కా కొట్టేస్తాడు?!! దీంతో పోలీసులు ఈ దొంగతనంపై కేసు నమోదుచేసి సదరు దొంగగారి కోసం గాలింపు ముమ్మరం చేశారు.
