Girisha: అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాపై సస్పెన్షన్ వేటు.. ఎందుకంటే?
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా వ్యహరించిన ఆయన లాగిన్ను దుర్వినియోగపరిచారని అభియోగం నమోదైంది.
- T Venkateshwarlu
- Published On : January 20, 2024 / 08:48 AM IST
Girisha
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను సస్పెండ్ చేస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ సమయంలో విజయవాడ విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా వ్యహరించిన ఆయన లాగిన్ను దుర్వినియోగపరిచారని అభియోగం నమోదైంది.
దీనిపై విచారణ జరిపిన ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని సీఎస్ను ఆదేశించింది. దీంతో జవహర్ రెడ్డి చర్యలు తీసుకున్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక 2021లో జరిగింది. ఓటరు గుర్తింపు కార్డులను కొందరు ఈసీ వెబ్సైట్ నుంచి అక్రమంగా డౌన్లోడ్ చేసుకున్నారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.
పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేశారని ప్రచారం జరిగింది. ఆ సమయంలో తిరుపతి కార్పొరేషన్కు గిరీషా కమిషనర్గా పనిచేసేవారు. అలాగే, లోక్సభ ఉప ఎన్నికకు ఆయన ఈఆర్వోగా వ్యవహరించారు. ఆయన ఐడీతో వేలాది ఎపిక్ కార్డులను డౌన్లోడ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. విజయవాడలో ఇటీవల జరిగిన సమావేశంలో ఆయనపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
