AP Cabinet meetc : ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. 2021, జూన్ 30వ తేదీ 11 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది. పలు కీలక అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. కోవిడ్ నియంత్రణపై సర్కార్ తీసుకుంటున్న చర్యలు, సంక్షేమ పథకాల అమలుతో పాటు ప్రధానంగా తెలంగాణతో జరుగుతున్న జల వివాదంపైనా మంత్రిమండలి చర్చించనుంది. జాబ్ క్యాలెండర్పై వస్తున్న విమర్శలపైనా చర్చించనుంది.
వచ్చే నెలలో నిర్మాణం చేపట్టే మూడు లక్షల జగనన్న ఇళ్ల నిర్మాణంపై క్యాబినెట్ చర్చించనుంది. దిశా చట్టం అమలు, ప్రజల నుంచి వస్తున్న స్పందనపై మంత్రులు చర్చిస్తారు. ఇటీవల అఘాయిత్యాలు, భవిష్యత్తులో పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించే అవకాశం ఉంది.
నూతన ఐటీ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. పేదల ఇళ్లపట్టాల క్రమబద్దీకరణకూ ఆమోదముద్ర వేయనుంది. శాసన మండలి చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక కోసం ప్రత్యేకంగా సమావేశం నిర్వహణపైనా చర్చ జరిగే అవకాశం వుంది.