AP Cabinet : ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై నిర్ణయం తీసుకోకున్న మంత్రివర్గం
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ఈ సమావేశంలో ప్రవేశపెట్టున్నట్లు సమాచారం. ఇవే కాకుండా కొన్ని ఆర్డినెన్స్ లకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను ప్రభుత్వం సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
- bheemraj
- Published On : September 20, 2023 / 07:18 AM IST
AP Cabinet meeting
AP Cabinet Meeting – CM JAGAN : ఏపీ కేబినెట్ సమావేశం నేడు(బుధవారం) జరుగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. వెలగపూడి సచివాలయంలోని ఫస్ట్ ఫ్లోర్ కేబినెట్ హాల్ లో ఈ సమావేశం జరుగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కేబినెట్ చర్చించనుంది. రేపటి (గురురవారం) నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల పని దినాలపై కేబినెట్ లో చర్చించనున్నారు.
ఇక రేపటి(గురువారం) నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు(గురువారం) ఉదయం 9 గంటలకు శాసన సభ, ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు మొదలవ్వనున్నాయి. ఐదు రోజులపాటు శాసన సభ సమావేశాలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అవసరాన్ని బట్టి సమావేశాలను మరో రెండు రోజులు పెంచే అవకాశం ఉంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ఈ సమావేశంలో ప్రవేశపెట్టున్నట్లు సమాచారం.
ఇవే కాకుండా కొన్ని ఆర్డినెన్స్ లకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను ప్రభుత్వం సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనపై ఉద్యోగులు ఇటీవల భేటీలో కొన్ని మార్పులు కోరారు. సీఎం జగన్ నిర్ణయాన్ని బట్టి మంత్రివర్గం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మరోసారి భేటీ అయి వీటిని ఖరారు చేయాల్సివుంది.
అన్ని ఆర్డినెన్స్ లకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను ఏపీ ప్రభుత్వం సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. బిల్లులతోపాటు కీలక అంశాలపై సభలో ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ ఉంది. సీఎం జగన్ విశాఖకు తరలి వెళ్లే అంశంపై సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల వేదికగా చంద్రబాబుపై కేసులను ప్రస్తావించడానికి వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
