×
Ad

AP CM Jagan : త్వరలో జిల్లా స్థాయి పర్యటనకు సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జిల్లా స్థాయి పర్యటనను వెళ్లనున్నారు.

  • Published On : July 6, 2021 / 09:18 PM IST

Cm Jagan Who Is Going On A District Level Tour Soon

AP CM Jagan : ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జిల్లా స్థాయి పర్యటనను వెళ్లనున్నారు. స్పందనపై మంగళవారం జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ తగ్గుముఖం పట్టగానే ఎమ్మెల్యేలు, అధికారులతో మండల స్థాయి పర్యటనలు చేయనున్నారు. ప్రతిరోజు ఒక గ్రామ, వార్డు సచివాలయాన్ని సందర్శిస్తానని జగన్ తెలిపారు. వారానికి రెండు సార్లు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తానని పేర్కొన్నారు. కోవిడ్ తగ్గుముఖం పట్టాక ఎమ్మెల్యేలు, అధికారులు కలిసి ప్రతి రోజు మండలస్థాయిలో సచివాలయాలను సందర్శించే కార్యక్రమం మొదలవుతుందన్నారు.

స్పందన కార్యక్రమంలో కోవిడ్ నివారణపై సీఎం జగన్ కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. ఇప్పటికే 10 సార్లు ఫీవర్ సర్వే చేశామని చెప్పారు. ఫీవర్ సర్వే నిరంతరాయంగా జరగాలన్నారు. లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేసి వైద్య సేవలందించాలని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలని ఆదేశించారు. దేవుడి దయ వల్ల కరోనా తగ్గుముఖం పట్టిందన్నారు. వ్యాక్సిన్ సెకండ్ డోస్ లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని సూచించారు. ఈ-క్రాపింగ్ పై మరింత దృష్టి పెట్టాలని చెప్పారు. ఇన్ పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, ప్రొక్యూర్ మెంట్, సున్నా వడ్డీ పంట రుణాలకు ఈ-క్రాపింగ్ వన్ స్టాప్ సొల్యూషన్ కావాలన్నారు. ఈ-క్రాపింగ్ రైతులకు శ్రీరామరక్ష…వారికి అన్యాయం జరగొద్దన్నారు.

ప్రతి నెల మొదటి శుక్రవారం ఆర్బీకే స్థాయిలో వ్యవసాయ మండలి సమావేశాలు జరగాలని చెప్పారు. రెండో శుక్రవారం మండలాల వారీగా, మూడో శుక్రవారం జిల్లాస్థాయిలో వ్యవసాయ మండలి సమావేశాలు నిర్వహించాలన్నారు. జులై 9 నుంచి 23 వరకు రైతు భరోసా చైతన్యయాత్రలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

కలెక్టర్లు, ఎస్పీలు రెండు వారాలకు ఒకసారి కలిసి కూర్చోవాలన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించుకోవాలని తెలిపారు. దుకాణాల్లో విత్తనాల నాణ్యతను పరిశీలన చేయాలన్నారు. నకిలీలను అడ్డుకునేందుకు కచ్చితంగా దాడులు కొనసాగాలని తెలిపారు.