CM Jagan Target 175 : రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలే టార్గెట్ గా ఏపీలో అధికార వైసీపీ ప్లాన్స్ రెడీ చేస్తోంది. దీనిలో భాగంగా క్షేత్రస్థాయిలో కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం జగన్. పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లు, నియోజకవర్గ పరిశీలకులతో సమావేశం అయిన సీఎం జగన్.. కొత్త వ్యవస్థపై దిశానిర్దేశం చేశారు.
గ్రామ, వార్డు, సచివాలయాలను ఒక క్లస్టర్ గా తీసుకుని ముగ్గురు చొప్పున సమన్వయకర్తలతో ఏర్పాటు చేయనున్నారు. అలాగే ప్రతి 50ఇళ్లకు ఇద్దరు గృహ సారథులను నియమించనున్నారు. ఇప్పటికే ప్రతీ 50 ఇళ్లకు ఒకరు చొప్పున సుమారు 2లక్షల 60వేల మంది వాలంటీర్లు ఉన్నారు. అయితే, వీరిని ఎన్నికల విధులకు ఉపయోగించుకోవడానికి చిక్కులు వచ్చే అవకాశం ఉండటంతో గృహ సారథులకు విధులు అప్పగించనున్నారు.
మొత్తం 15వేల గ్రామాల్లో 5లక్షల 20వేల మంది గృహ సారథులు ఉంటారు. వారికి కేటాయించిన 50ఇళ్లలోని వారికి ప్రభుత్వ పథకాలు అందాయా లేదా తెలుసుకోవడం, పార్టీ కార్యక్రమాలను వారి దృష్టికి తీసుకెళ్లడం వంటి పనులు చేస్తారు. ప్రతి ముగ్గురు గృహ సారథుల్లో ఒక మహిళ తప్పనిసరిగా ఉండాలన్నారు సీఎం జగన్.
ఎమ్మెల్యేలను బలోపేతం చేసేందుకే క్షేత్ర స్థాయి వరకు పార్టీ యంత్రాంగాన్ని నియమిస్తున్నామన్నారు సీఎం జగన్. ఈ నెల 20లోపు గృహసారథుల నియామకం పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం వారు తమ పరిధిలోని ఇళ్లకు వెళ్లి.. పార్టీ వివరాలను తెలియజేయాలన్న జగన్.. దాని ద్వారా అనుకూల, ప్రతికూల అంశాలపై స్పష్టత వస్తుందన్నారు. ఎమ్మెల్యేలను గెలిపించాల్సిన బాధ్యత సమన్వయకర్తలు, గృహసారథులపై ఉంటుందంటున్న జగన్.. ఎంత కష్టపడితే ఫలితం అలాగే వస్తుందన్నారు.
Also Read..Pawan kalyan : జనసేన ’వారాహి’ వాహనం రంగుపై వైసీపీ విమర్శలకు పవన్ కల్యాణ్ కౌంటర్
మొత్తంగా 2024 ఎన్నికలకు సీఎం జగన్ ఇప్పటి నుంచే శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. 175 స్థానాలు లక్ష్యంగా ఖతర్నాక్ స్కెచ్ వేశారు. ఇందులో భాగంగానే పార్టీ తరపున 5.20లక్షల మంది గృహసారథులను నియమించాలని ఆదేశించారు సీఎం జగన్. వారితో ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు అందాయో లేదో కనుక్కోవడం, అందకపోతే అందేలా చూడటం వంటివి చేయిస్తారు. 2.60లక్షల మంది వాలంటీర్లు ఇదే పని చేస్తుండగా.. ఎన్నికల సమయంలో వారిపై ఈసీ ఆంక్షలు విధించే అవకాశం ఉండటంతో జగన్ ఈ దిశగా ఆలోచించినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.