శెభాష్ దేవాన్ష్.. నారా లోకేశ్ కొడుక్కి పవన్ కళ్యాణ్ ప్రశంస.. ఇంకా రికార్డులు బద్దలు కొట్టాలంటూ
మంత్రి నారా లోకేశ్ కుమారుడు నారా దేవాన్ష్ ను జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఇటీవల దేవాన్షన్ కేవలం 11 నిమిషాల 59 సెకండ్లలో ...
- Harishth Thanniru
- Published On : January 27, 2025 / 11:19 AM IST
AP Deputy CM Pawan Kalyan
Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేశ్ కుమారుడు నారా దేవాన్ష్ ను జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఇటీవల దేవాన్ష్ కేవలం 11 నిమిషాల 59 సెకండ్లలో 175 చెస్ పజిల్స్ పూర్తి చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోను ట్విటర్ ఖాతాలో పవన్ కల్యాణ్ పోస్టు చేశారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే చెస్ లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన దేవాన్ష్ భవిష్యత్తులో మరిన్ని రికార్డులు నెలకొల్పి గ్రాండ్ మాస్టర్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ పవన్ కల్యాణ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Also Read: Pawan Kalyan : వాటి జోలికి వెళ్లొద్దు- జనసైనికులకు పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ.. ఇంకా ఏమన్నారంటే..
తొమ్మిదేళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
గత నెలలో చదరంగంలో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్ ను పావులు వేగంగా కదపడం ద్వారా కేవలం తొమ్మిదేళ్ల ప్రాయంలోనే దేవాన్ష్ ‘ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్-175 పజిల్స్’ రికార్డును సొంతం చేసుకున్నాడు. వ్యూహాత్మకమైన ఆటతీరుతో 11 నిమిషాల 59 సెకండ్లలోనే చెక్ మేట్ పజిల్స్ ను దేవాన్ష్ పూర్తి చేశాడు. 5334 ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్ అన్న పుస్తకం నుంచి తీసుకున్న పజిల్స్ తో ఈ పోటీని రూపొందించారు. ఇదిలాఉంటే.. దేవాన్ష్ అంతకుముందు మరో రెండు రికార్డులను సాధించాడు. 7డిస్క్ టవర్ ఆఫ్ హనోయ్ ని కేవలం 1నిమిషం 43 సెకండ్లలో పూర్తి చేశాడు. తొమ్మిది చెస్ బోర్డుల్ని కేవలం ఐదు నిమిషాల్లో అమర్చాడు. అదేవిధంగా.. ప్రతి బోర్డులోనూ మొత్తం 32 పావుల్ని వేగంగా సరైన స్థానాల్లో ఉంచాడు. ఈ ప్రయత్నాలను న్యాయనిర్ణేతలు, లండన్ లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు పరిశీలించి ధ్రువీకరించారు. అద్భుత ప్రతిభ చూపిన దేవాన్ష్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ తోపాటు పలువురు మంత్రులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు. తాజాగా పవన్ కల్యాణ్ దేవాన్ష్ ను అభినందిస్తూ ట్వీట్ చేశారు.
Also Read: Stroke Risk : బాబోయ్.. తల్లిదండ్రులు విడిపోయిన పిల్లల్లో ఈ భయంకరమైన జబ్బు వచ్చే ప్రమాదం ఉందట..!
పవన్ ట్వీట్ తో టీడీపీ శ్రేణుల్లో ఆనందం..
దేవాన్ష్ ను ప్రశంసిస్తూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేయడం పట్ల టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మంత్రి నారా లోకేశ్ ను డిప్యూటీ ముఖ్యమంత్రి చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. పలువురు టీడీపీ నేతలు బహిరంగంగానే లోకేశ్ ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే, టీడీపీ నేతల డిమాండ్ పై జనసేన నేతలు తప్పుపట్టారు. పవన్ డిప్యూటీ సీఎంగా ఉండగా.. మరో డిప్యూటీ సీఎం ఎందుకంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో కూటమిలోని టీడీపీ, జనసేన నేతల మధ్య కాస్త గ్యాప్ వచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే, లోకేశ్ డిప్యూటీ సీఎం అంశాన్ని పార్టీ నేతలు ఎవరూ మాట్లాడొద్దని టీడీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేయడంతో వివాదానికి చెక్ పడింది.
లోకేశ్ డిప్యూటీ సీఎం డిమాండ్ పై పవన్ కల్యాణ్ కాస్త నొచ్చుకున్నట్లు ఏపీ రాజకీయాల్లో ప్రచారం జరిగింది. దీంతో పవన్, లోకేశ్ మధ్య మాటలు లేవన్న ప్రచారంసైతం జరిగింది. అయితే, ఆదివారం జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న లోకేశ్, పవన్ నవ్వుతూ సరదాగా మాట్లాడుకోవటం కనిపించింది. ఇదేక్రమంలో పవన్ కల్యాణ్ దేవాన్ష్ ను అభినందిస్తూ ట్వీట్ చేయడం పట్ల పవన్, లోకేశ్ మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవన్న విషయం స్పష్టమైందని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి శ్రీ @naralokesh గారి తనయుడు, గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి మనవడు చిరంజీవి నారా దేవాన్ష్ కేవలం 11 నిమిషాల 59 సెకండ్లలో 175 చెస్ పజిల్స్ పూర్తి చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించినందుకు మనస్ఫూర్తిగా… pic.twitter.com/ILRvGNNkwH
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) January 27, 2025
