Pawan Kalyan : వాటి జోలికి వెళ్లొద్దు- జనసైనికులకు పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ.. ఇంకా ఏమన్నారంటే..
అనుభవం కలిగిన పాలన, భావితరాల భవిష్యత్ గురించి ఆలోచించే నాయకులు కలిసి రావడంతో అఖండ విజయంతో గెలిచామని పవన్ కల్యాణ్ అన్నారు.

Pawan Kalyan : జనసేన నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ పొరపాటున కూడా స్పందించవద్దని పవన్ కల్యాణ్ ఆదేశించారు. జనసైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ రాశారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సాధించిన అద్వితీయ ఘన విజయం చరిత్రాత్మకం అని తెలిపారు. ఇది కేవలం ఒక్క కూటమి బలం మాత్రమే కాదన్నారు. గత ఐదేళ్ల వైసీపీ నిరంకుశ పాలనపై, పాలకుల అవినీతిపై, సంఘ విద్రోహక చర్యలపై చట్ట సభల్లో వారు చేసిన జుగుప్సాకరమైన వ్యవహారశైలిపై ప్రజలు విసుగు చెందారని అన్నారు. ఏపీలో శాంతిభద్రతల వైఫల్యాలపై ముఖ్యంగా అభివృద్దికి తావు లేకుండా వైసీపీ నేతలు రాష్ట్రాన్ని తిరోగమనం పాలు చేశారని మండిపడ్డారు పవన్ కల్యాణ్.
అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చటంపై ప్రజలు ఆగ్రహం చూపించారని అన్నారు. సుస్థిరమైన ప్రభుత్వం కోసం స్థిరమైన నాయకత్వం కోసం రాష్ట్ర పరిపాలనను, అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు ప్రజలు నడుం బిగించారని అన్నారు. అనుభవం కలిగిన పాలన, భావితరాల భవిష్యత్ గురించి ఆలోచించే నాయకులు కలిసి రావడంతో అఖండ విజయంతో గెలిచామని పవన్ కల్యాణ్ అన్నారు.
Also Read : ఏపీలో మంత్రులకు రేటింగ్ టెన్షన్..! చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు?
పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ..
ప్రియమైన జనసైనికులకు, వీరమహిళలకు, జనసేన నాయకులకు నా హృదయపూర్వక నమస్కారం, 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ.. ఎన్డీయే కూటమిగా సాధించిన అద్వితీయ ఘన విజయం చరిత్రాత్మకం. ఇది కేవలం ఒక్క కూటమి బలం మాత్రమే కాదు. గత ఐదేళ్ల వైసీపీ నిరంకుశ పాలనపై, పాలకుల అవినీతిపై, సంఘ విద్రోహక చర్యలపై, చట్ట సభల్లో వారు చేసిన జుగుప్సాకర వ్యవహార శైలిపై, శాంతి భద్రతల వైఫ్యల్యాలపై, ముఖ్యంగా అభివృద్ధికి తావు లేకుండా రాష్ట్రాన్ని తిరోగమనం పాలు చేసి, అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చడంపై విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు..
సుస్థిరమైన ప్రభుత్వం కోసం, స్థిరమైన నాయకత్వం కోసం, రాష్ట్ర పరిపాలనను, అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు అనుభవం కలిగిన పాలన, భావి తరాల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకులు కలిసి రావడంతో కూటమిపై నమ్మకంతో ప్రజలు 94శాతం విజయంతో 164/175 స్థానాలను NDA కూటమికి, 100శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన 21/21 అసెంబ్లీ స్థానాలు, 2/2 పార్లమెంటు స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్ధులను గెలిపించారు. కట్టబెట్టారు.
ఈ విజయాన్ని ప్రజలు మనకిచ్చిన బాధ్యతగా మలచుకుని అధికారం చేపట్టిన రోజు నుండి ప్రధాని మోడీ మార్గదర్శకత్వంలో, కేంద్ర సహాయ, సహకారాలతో, సీఎం చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో సమగ్రాభివృద్ధి సాధించే దిశగా చిత్తశుద్దితో పనిచేస్తుంది.
5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని, యువతకు 25 ఏళ్ల భవిష్యత్తు అందించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి మూడు పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది. అనవసరమైన వివాదాల జోలికి, విభేదాల జోలికి వెళ్ళవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.
Also Read : మీరు నాకు తెలుసు.. మీకూ ఇలాంటి ఫోన్ కాల్ వచ్చిందా? టెంప్ట్ అయ్యారో ఖతమే..
సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ, పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే దయచేసి ఎవరూ కూడా ప్రతిస్పందనగా మీ వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లిబుచ్చడం కానీ, బహిరంగంగా చర్చించడం కానీ చేయవద్దు.
ఎంతో బాధ్యతగా 5 కోట్ల ప్రజల ఆశలను నెరవేర్చాలనే లక్ష్యంతో, 2047 నాటికి స్వర్ణ ఆంధ్ర సాధించి వికసిత్ భారత్ సాధనలో 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా కలిసి కట్టుగా పని చేస్తున్న సందర్భంలో ప్రతీ ఒక్కరూ చేయీ, చేయీ కలిపి నడవాల్సిన అవసరం ఉంది. నేను ఏ రోజు పదవుల కోసం రాజకీయం చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయను, నాకు తెలిసింది కష్టాల్లో ఉన్న వారి కన్నీరు తుడవటం, వారికి అండగా నిలబడటం, నేను పుట్టిన నేలను అభివృద్ధి చేయాలనుకోవడం మాత్రమే.
ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని అర్ధం చేసుకుని ముందుకు సాగాలని మనస్పూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, మార్చ్ 14 న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్తు లక్ష్యాలు గురించి సమగ్రంగా చర్చించుకుందామని తెలియజేస్తున్నాను.