AP Education Department: మెగా DSC అక్రమాలపై ప్రభుత్వం క్లారిటీ.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ.. పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్(AP Education Department)లో మెగా డీఎస్సీ నియామకాల వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది.
- V Santhosh Kumar
- Published on- September 5, 2026 / 03:45 PM IST
Ap education department orders inquiry on mega dsc recruitment allegations kurnool
- డీఎస్సీపై సీబీఐ విచారణ డిమాండ్
- కౌతాళం ఘటనపై శాఖాపరమైన దర్యాప్తు
- పారదర్శకంగానే నియామకాల ప్రక్రియ పూర్తి
AP Education Department: ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ నియామకాల వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. డీఎస్సీ ఎంపిక ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేపట్టడంతో పాటు, విద్యాశాఖ (AP Education Department)మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో క్రీడా కోటా కింద ఎస్జీటీ పోస్టింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న వార్తలపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ తక్షణమే స్పందించి శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించింది.
కౌతాళం ఘటనపై డీఈఓ విచారణ.. రికార్డులు స్వాధీనం:
కర్నూలు జిల్లా వల్లూరు ఎంపీపీఎస్ పాఠశాలలో ఈడిగ ప్రభాకర్ ఎస్జీటీగా ఎంపికైన వ్యవహారంపై డీఈఓ నేతృత్వంలో సమగ్ర విచారణ ప్రారంభమైంది. ఘటనపై సమాచారం అందిన వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు, దర్యాప్తు కోసం సంబంధిత వెరిఫికేషన్ ఫైళ్లు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. విచారణ పూర్తయిన వెంటనే నివేదిక ఆధారంగా సర్వీస్ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ స్పష్టం చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పారదర్శకంగానే ఎంపికలు.. పుకార్లను నమ్మవద్దని విద్యాశాఖ విజ్ఞప్తి:
మెగా డీఎస్సీ నియామకాలన్నీ సంపూర్ణ పారదర్శకతతో, కేవలం ప్రతిభ ఆధారంగానే జరిగాయని విద్యాశాఖ పునరుద్ఘాటించింది. ప్రతి ఎంపికలోనూ నిబంధనలను పక్కాగా పాటించామని, అక్కడక్కడా వస్తున్న ఆరోపణలపై పూర్తిస్థాయి పరిశీలన జరిపి వాస్తవాలను బయటపెడతామని తెలిపింది. రిక్రూట్మెంట్లో ఎలాంటి అక్రమాలకు తావులేదని, అభ్యర్థులు, ప్రజలు ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
