డీజిల్ తేలేని వ్యక్తి గూగుల్ తెస్తాడా? గవర్నర్ పాలన ఉన్నా బాగుండేదేమో? ఏపీలో ఇంధన కొరతపై సజ్జల సంచలన వ్యాఖ్యలు
ఎన్డీయే కూటమిలో ఉన్న ఏపీలో ఇంధన కొరత రావడమేంటి..? తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లేని కొరత ఏపీలో ఎందుకు వచ్చింది..? ఈ పరిస్థితికి కారణాలేంటో ప్రజలకు తెలియజెయ్యరా..?
- Naveen
- Updated on- April 28, 2026 / 04:52 PM IST
Sajjala Ramakrishna Reddy: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. వారం రోజులుగా రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే ప్రభుత్వం లేదని స్పష్టం అవుతోందన్నారు. ఇంధన కొరతతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇంధన కొరత కళ్ల ముందే కనిపిస్తుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఏ రోడ్డు చూసినా బంకుల వద్ద క్యూ లైన్ లు దర్శనమిస్తున్నాయన్నారు. ప్రజలు అవస్థలు పడుతుంటే ప్రభుత్వం నిద్రపోతుందా? నిద్ర నటిస్తుందా..? అని నిలదీశారు. ఇది పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అని సజ్జల విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని కొరత ఏపీలోనే ఎందుకొచ్చింది..? అని ఆయన ప్రశ్నించారు.
కనీసం డీజీల్ తీసుకురాలేని వ్యక్తి గూగుల్ ను ఏం తెస్తాడా? అని జనం నవ్వుకుంటున్నారు. టూ వీలర్ నడుపుకునేందుకు పెట్రోల్ సప్లయ్ చేయలేని వ్యక్తి పెద్ద పెద్ద పరిశ్రమలు ఏం తెస్తారు? అని జనం అనుకుంటున్నారు. రాష్ట్రంలో గవర్నర్ పాలన ఉన్నా బాగుండేదేమో అని, అడ్మినిస్ట్రేషన్ అన్నా నార్మల్ గా జరిగేదేమో, గవర్నర్ పాలనలో ఉంటే అధికారులు వారి పనులు వారు చేసుకునే వారు” అని సజ్జల అన్నారు.
”ఎన్డీయే కూటమిలో ఉన్న ఏపీలో ఇంధన కొరత రావడమేంటి..? తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లేని కొరత ఏపీలో ఎందుకు వచ్చింది..? ఈ పరిస్థితికి కారణాలేంటో ప్రజలకు తెలియజెయ్యరా..? ఇది క్రెడిట్ సమస్య కాదు. దేశం మొత్తం ఒకటే సిస్టమ్ ఉంటుంది కదా..? అసమర్థత, చేతకాని తనం కాదు.. ఈ సంక్షోభానికి వీళ్ళే కారణం. కూటమి నేతలు పెంచి పోషిస్తున్న దళారీ వ్యవస్థే కారణం. సంక్షోభం వచ్చినప్పుడల్లా కూటమి దళారీ వ్యవస్థ యాక్టివ్ అవుతుంది. కూటమి పెద్దల అండదండలతో బ్లాక్ మార్కెట్ దందా కొనసాగుతుంది.
యూరియా, గ్యాస్, పెట్రోల్ డీజిల్ వీటి కొరత అంతా ఈ బ్లాక్ మార్కెట్ వల్లే. బైక్ కి 100, కార్ కి వెయ్యి అంటే ప్రజలు ప్రయాణాలు ఎలా చేస్తారు..? ఎక్కడికి వెళ్తారు..? అమరావతిలో నిర్మాణాల కోసం 27 వేల కిలో లీటర్స్ డీజిల్ ఇవ్వాలని ఆయిల్ కంపెనీలని రాష్ట్ర ప్రభుత్వం అడిగింది. సివిల్ సప్లై సెక్రటరీ OMC లకు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం లేఖను కేంద్రం అంగీకరించలేదు. అలా ఇవ్వలేమని రిప్లై ఇచ్చారు. అమరావతి కోసం అన్ని వేల లీటర్లు వాడేస్తే మిగిలిన వాళ్లకి ఎలా సప్లై చేస్తారు?” అని సజ్జల అన్నారు.
Also Read: ఏపీలో కీలక పరిణామం.. గూగుల్ డేటా సెంటర్ కు శంకుస్థాపన.. కేవలం రెండేళ్లలో
