Tenth Class Exams : పరీక్షలు అంటే చాలు.. విద్యార్థుల్లో భయం మొదలవుతుంది. పైగా ఈ ఏడాది కరోనా కారణంగా చాలావరకు సిలబస్ పూర్తి కాలేదు. అయినా పరీక్షలకు సమయం దగ్గర పడిపోయింది. దీంతో విద్యార్థుల్లో టెన్షన్ పెరిగింది. ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారి నెత్తిన పాలు పోసింది.
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 11 పరీక్షలను ఆరుకు కుదించిన సర్కార్ తాజాగా పరీక్షలు రాసే సమయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల భయాలను దృష్టిలో ఉంచుకుని జగన్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
మొదటి, ద్వితీయ, తృతీయ భాషా పరీక్షలకు సమయాన్ని కాస్త పెంచారు. మ్యాథ్స్, సామాజిక శాస్త్రం(సోషల్), భౌతికశాస్త్రం(ఫిజిక్స్), జీవశాస్త్రం(బయాలజీ) పరీక్షలకు అరగంట సమయాన్ని పెంచారు. కంపోజిట్ కోర్సులోని రెండో భాష (పేపర్-2)కు 1.45 గంటలు, ఒకేషనల్ కోర్సు పరీక్షకు 2 గంటల సమయాన్ని పెంచారు.
భాషలు(లాంగ్వేజస్), గణితం(మ్యాథ్స్), సామాజిక శాస్త్రానికి(సోషల్) 100 మార్కుల ప్రశ్నా పత్రాలు.. భౌతికశాస్త్రం(ఫిజిక్స్), జీవశాస్త్రం(బయాలజీ) పరీక్షలకు 50 మార్కుల ప్రశ్నా పత్రాలు ఉండనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది ప్రభుత్వం.
సాధారణంగా పరీక్షలు అంటే విద్యార్థుల్లో ఉండే అసలైన టెన్షన్ టైం. ఓ వైపు సమయం అయిపోతుంటుంది. అయినా జవాబులు రాయడం పూర్తి అవ్వడం లేదనే టెన్షన్ ఉంటుంది. చాలామంది విద్యార్థులకు ఇదే సమస్య. అసలే సిలబస్ పూర్తి అవ్వని సమయంలో పరీక్ష పత్రంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు సరైన సమయంలో రాయగలమా అనే భయం విద్యార్థుల్లో పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు రాసే సమయాన్ని పెంచడం ద్వారా విద్యార్థులకు జగన్ ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చిందనే చెప్పుకోవాలి.