VOA: వీవోఏలకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. రూ.22 కోట్లు విడుదల
గ్రామ స్థాయిలో స్త్రీ నిధి రుణాల వసూలు, సంఘాల బలోపేతానికి వీవోఏలు అందిస్తున్న సేవలు కీలకం అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
- Naveen
- Updated on- April 22, 2026 / 04:26 PM IST
VOA: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు (VOA) రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. వీవోఏలకు రూ.22.67 కోట్ల ప్రోత్సాహక బకాయిలను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశాలు ఇచ్చారు. స్త్రీ నిధి ద్వారా విడుదల కావాల్సిన ఈ నిధులకు సంబంధించి మంత్రి కీలక సూచనలు చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27,336 మంది వీఏవోలకు లబ్ధి కలగనుంది.
ఒక సంవత్సరానికి 22.67 కోట్ల రూపాయల నిధులు ప్రోత్సాహకంగా విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,336 గ్రామ సంఘాల్లో పని చేసే వీవోఏలకు ఈ నిధులు ప్రోత్సాహకంగా అందజేయనున్నారు. ఇప్పటికే స్త్రీ నిధి ద్వారా గ్రామ సంఘాలకు 0.25 % ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. స్వయం సహాయక సంఘాల (SHGs) నుంచి వసూలైన వడ్డీ ఆధారంగా 0.75 % ప్రోత్సాహకాన్ని వీవోఏలకు ఇవ్వాలని నిర్ణయించారు.
గ్రామ స్థాయిలో స్త్రీ నిధి రుణాల వసూలు, సంఘాల బలోపేతానికి వీవోఏలు అందిస్తున్న సేవలు కీలకం అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందించాలన్న ఉద్దేశంతోనే ఈ నిధులు తక్షణమే గ్రామ సంఘాల ఖాతాల్లో జమ చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్.
Also Read: వాలంటీర్ వ్యవస్థ చరిత్రేనా? వచ్చే ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థ ముచ్చటే ఉండబోదా?
