AP govt a House Motion Petition : వకీల్ సాబ్ సినిమా టికెట్ ధరల పెంపుపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సాయంత్రం 6 గంటలకు ఈ పిటిషన్ను విచారించే అవకాశం ఉంది. వకీల్ సాబ్ సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు అనుమతించాలంటూ గత నెల 25వ తేదీన థియేటర్ల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. వారి వినతిని మన్నించిన హైకోర్టు.. టికెట్ ధరల పెంపునకు అనుమతించింది. అయితే టికెట్ ధరల పెంపును ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో ధరల పెంపు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్సాబ్ సినిమా 2021, ఏప్రిల్ 9వ తేదీ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా 2500 స్ర్కీన్ లో రిలీజ్ అయ్యింది. పవన్ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత వెండితెరపై మెరిశాడు. అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అర్ధరాత్రి నుంచే థియేటర్ల దగ్గర అభిమానుల సందడి అంతా ఇంతా కాదు. హిందీ `పింక్` రీమేక్ గా రూపొందించిన ఈ సినిమా యూఎస్, దుబాయ్ వంటి దేశాల్లో ఒక్క రోజు ముందే ప్రీమియర్ షోస్ పడ్డాయి.
పవన్ కళ్యాణ్ హీరోగా, శృతి హాసన్ ఆయనకు జోడిగా నటించిన ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. `ఎంసీఏ` ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. దిల్రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. వకీల్ సాబ్ కోసం తెల్లవారు జాము నుండి సినిమా ధియేటర్స్ వద్ద పవన్ అభిమానులు సందడి చేశారు.