AP Government: ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వారసత్వ స్థలాల రిజిస్ట్రేషన్ మరింత ఈజీ.. జస్ట్ ఇలా చేస్తే చాలు..!

కొత్త మార్గదర్శకాలతో ఇకపై రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన బాధ ఉండదు. నేరుగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకునే వెసులుబాటు కలిగింది.

  • Published On : March 13, 2026 / 06:19 PM IST

Inherited Non Agricultural Lands Registration Representative Image (Image Credit To Original Source)

  • వారసత్వంగా లభించే వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్లు మరింత సులభం
  • రిజిస్ట్రేషన్‌కు రెవెన్యూ శాఖ సర్టిఫికెట్ అవసరం లేదు
  • స్థలం యజమానుల సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే చాలు
  • తప్పుడు సమాచారం ఇస్తే సివిల్, క్రిమినల్ కేసులు

 

AP Government: వారసత్వంగా లభించే వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారసత్వంగా లభించే వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ను మరింత ఈజీ చేసింది. వారసత్వంగా లభించే వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం ఇకపై గ్రామాల్లోని వారసత్వంగా లభించే వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్‌కు రెవెన్యూ శాఖ సర్టిఫికెట్ అవసరం లేదు. స్థలం యజమానుల సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే చాలు. తమకు పూర్వీకుల నుంచే ఆస్తి వచ్చిందని, నిషేధిత జాబితా(22A)లో లేదని, తామే పూర్తి హక్కుదారు అని అందులో స్పష్టంగా పేర్కొనాలి. అయితే, ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ తప్పుడు సమాచారం ఇస్తే కనుక కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.

గతంలో ఇటువంటి ఆస్తుల బదలాయింపు పెద్ద ప్రహసనంగా ఉండేది. పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన వ్యవసాయేతర భూములను రిజిస్ట్రేషన్ చేసేందుకు హక్కు ఉన్నట్లు యజమానుల దగ్గర ఎలాంటి ఆధారాలు ఉండవు. దీంతో భవిష్యత్తులో సమస్యలు రాకుండా రెవెన్యూ శాఖ నుంచి యాజమాన్య హక్కు ఉన్నట్లుగా ధృవీకరణ పత్రాలు తీసుకురావాలని రిజిస్ట్రార్లు అడుగుతున్నారు. అయితే రెవెన్యూ శాఖ నుంచి సర్టిఫికెట్‌ తీసుకోవడం సామాన్యులకు పెను భారం అవుతోంది. ఈ ఇబ్బందులను తొలగిస్తూ రిజిస్ట్రేషన్ నిబంధనలను సవరించింది ప్రభుత్వం. కొత్త మార్గదర్శకాలతో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పాత ఇళ్లు, స్థలాల రిజిస్ట్రేషన్లు జాప్యం లేకుండా వేగంగా పూర్తి కానున్నాయి.

వారసత్వ ఆస్తుల నమోదు కోసం యజమానులు ఇచ్చే సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాన్నే ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఆ ఆస్తి తమ పూర్వీకుల నుంచి సంక్రమించిందని, దానిపై తమకు పూర్తి యాజమాన్య హక్కులు ఉన్నాయని యజమానులు లిఖితపూర్వకంగా ఇస్తే సరిపోతుంది. కొత్త మార్గదర్శకాలతో ఇకపై రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన బాధ ఉండదు. నేరుగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకునే వెసులుబాటు కలిగింది. ప్రభుత్వ నిర్ణయంపై సామాన్య ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సెల్ఫ్ డిక్లరేషన్‌కు సంబంధించి యజమానులు కొన్ని ముఖ్యమైన అంశాలను స్పష్టంగా పొందుపరచాలి. సంబంధిత స్థలం లేదా ఆస్తి ప్రభుత్వం ప్రకటించిన నిషేధిత జాబితా (సెక్షన్ 22A)లో లేదని ధృవీకరించాలి. అంతేకాదు ఎలాంటి వివాదాలు లేని పూర్తి హక్కుదారు తామేనని డిక్లరేషన్‌లో పేర్కొనాలి. మరో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. సెల్ఫ్ డిక్లరేషన్ పత్రంలో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చినా, వాస్తవాలను దాచి పెట్టినా వారిపై చట్టపరమైన చర్యలు (సివిల్, క్రిమినల్ కేసులు) తప్పవు.