MEC Cancelled : విద్యా బోధనకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గురుకులాల్లో ఇప్పటిదాకా విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఎంఈసీ (మ్యాథ్స్, ఎకనమిక్స్, కామర్స్) కోర్సును రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. గణితంతో పాటు ఆర్థిక శాస్త్రంపై మంచి పట్టు సాధించాలనుకునే వారు ఈ కోర్సును ఎంపిక చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఏపీ గురుకుల విద్యాలయాల్లో అందుబాటులో ఉన్న ఎంఈసీ కోర్సును రద్దు చేస్తున్నట్లు మంత్రి నాగార్జున ప్రకటించారు. ఈ కోర్సు స్థానంలో ఎంపీసీ, బీపీసీ కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎంఈసీ కోర్సు రద్దు నిర్ణయం వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి రానుందనన్నారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
గురుకులాల్లో ఇంటర్ లో ఎంఈసీ కోర్సుకి డిమాండ్ లేదు. దాని స్థానంలో సైన్స్ కోర్సులను ప్రవేశపెట్టడానికి సాంఘిక సంక్షేమశాఖ నిర్ణయం తీసుకుంది. రానున్న విద్యా సంవత్సరం నుంచే కొత్త కోర్సులు ప్రారంభమయ్యేలా చూడాలని మంత్రి మేరుగ నాగార్జున అధికారులను ఆదేశించారు. ఎస్సీ గురుకులాల కార్యకలాపాలపై సచివాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి నాగార్జున పలు అంశాలపై సమీక్ష చేశారు. ఇంటర్ లో ఎంపీసీ, బైపీపీ వంటి సైన్స్ సీట్ల కోసం పోటీ పడుతున్న విద్యార్థులు ఎంఈసీ సీట్లలో చేరడానికి ముందుకు రాని కారణంగానే సీట్లు ఖాళీగా మిగిలే పరిస్థితి ఏర్పడుతోందని చెప్పారు.
ఈ నేపథ్యంలోనే ఎంఈసీ కోర్సుల స్థానంలో విద్యార్థులు ఎక్కువగా కోరుకుంటున్న ఎంపీసీ, బైపీసీ సీట్లను ప్రవేశపెట్టాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు జాబ్ గ్యారెంటీ ఇచ్చే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ వంటి కోర్సులను జిల్లా కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. గురుకులాల్లో మొత్తం 1.17 లక్షల సీట్లు ఉండగా వీటిలో ప్రస్తుతం 1.09 లక్షల సీట్లు భర్తీ కావడం జరిగిందని చెప్పారు. ఖాళీగా మిగిలిపోయిన సీట్లలో ఎక్కువగా ఇంటర్ కు చెందిన సీట్లే ఉన్నాయని తెలిపారు.