ఏపీలో టెన్త్ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. ఏపీలో లాక్ డౌన్ ముగిసిన తర్వాత టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత రెండు వారాల సమయం ఇచ్చి పరీక్షలు పెడతామన్నారు. త్వరలోనే టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ లు ధరించి పరీక్షలు నిర్వహించే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మంత్రి సురేష్ చెప్పారు. లాక్ డౌన్ కారణంగా ఏపీలో టెన్త్ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. విద్యా సంస్థలు కూడా మూతబడ్డాయి. కాగా 1 నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు పంపాలని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే.
జూన్ నుంచి పూర్తి స్తాయిలో నాడు-నేడు:
సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాడు నేడు కార్యక్రమం జూన్ నుండి పూర్తిస్థాయిలో అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. మొదటి విడతలో 15 వేల పాఠశాలల్లో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. రెండో, మూడో దశలో మిగిలిన పాఠశాలల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. మొత్తం 45 వేల పాఠశాలల్లో ప్రస్తుతం 15,800 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతుండగా రెండు, మూడో దశల్లో 29,200 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. రెండోదశలో పాఠశాలలతో పాటు జూనియర్ కశాశాలు, వాటితోపాటు వసతి గృహాలలో చేస్తామన్నారు. వాటికి సంబంధించి టెండర్ షెడ్యూల్, ఫైనాన్సియల్ అప్రూవల్స్, ఎస్టిమేట్స్ అన్నింటినీ ఒక టైమ్ లైన్ ద్వారా త్వరతగతిన పూర్తిచేయాలని సీఎం సూచించారన్నారు. లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నామని వివరించారు.
ఉన్నత విద్యలో కూడా ఆన్ లైన్ క్లాసులు:
ఉన్నత విద్యలో కూడా ఆన్ లైన్ క్లాసులను ప్రారంభించడం జరిగిందన్నారు. సప్తగిరి ఛానెల్ ద్వారా 10వ తరగతి విద్యార్థులకు పోగ్రామ్స్ డిజైన్ చేసుకోవడం జరిగిందన్నారు. విద్యాకలశం అని ఆల్ ఇండియా రేడియోలో రెయిన్ బో ఛానెల్ ద్వారా ఏడు రేడియో స్టేషన్ల నుండి ఆన్లైన్ ఆడియో క్లాసులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. అలాగే యూనివర్సిటీల్లో కూడా ఎక్కడైతే క్లాస్ వర్క్ కమిన్స్ కాలేదో ఆన్లైన్ క్లాసులను యాప్స్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా క్లాస్ వర్క్ ప్రారంభించాలని ఆయా యూనివర్సిటీల వీసీలకు ఆదేశాలివ్వడం జరిగిందన్నారు. వాటి ద్వారా ఆన్లైన్ క్లాస్ వర్కస్ జరుపుతూ కోర్సుల వర్కస్ కంప్లీట్ చేయాలని చెప్పామన్నారు.
కొన్ని చానల్స్ ఆన్లైన్లో ఫ్రీ కోచింగ్ ఇచ్చేలా జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ అనంతపురం వారిని సంయుక్తంగా క్లాస్వర్క్ తయారు చేయాలని కోరామన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఏ క్లాసులు కోల్పోయామో వాటిని ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో అధ్యాపకులకు కూడా అభ్యాస్ అనే యాప్ ద్వారా ట్రైనింగ్ పోగ్రామ్స్ నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.