Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి పిటిషన్పై విచారణను వాయిదా వేసిన హైకోర్టు
ఏపీలో ఎన్నికలు జరుగుతున్న వేళ పాల్వాయిగేటు కేంద్రంలోకి వెళ్లిన పిన్నెల్లి ఈవీఎంను..
- T Venkateshwarlu
- Published On : August 5, 2024 / 07:05 PM IST
Pinnelli Ramakrishna Reddy
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా, మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. తనపై పల్నాడు పోలీసులు నమోదు చేసిన కోసుల్లో బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి తాజాగా పిటిషన్ వేయగా, దానిపై విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.
ఏపీలో ఎన్నికలు జరుగుతున్న వేళ పాల్వాయిగేటు కేంద్రంలోకి వెళ్లిన పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై ఆయన దాడికి దిగారు. ఆ తదుపరి రోజు కారంపూడిలో టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆయనపై రెంటచింతలతో పాటు కారంపూడి పోలీసులు హత్యాయత్నం, మరిన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పిన్నెల్లిని పోలీసులు జూన్ 26న అరెస్టు చేయగా, కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన నెల్లూరు జైలులో ఉన్నారు. అలాగే, కింది కోర్టులో బెయిలు కోసం పిన్నెల్లి ప్రయత్నించగా కోర్టు వాటిని కొట్టేసింది. గతంలో తనకు అరెస్ట్ నుంచి ఉపశమనం కల్పించాలని పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్లను కూడా ఏపీ హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే.
